koodali

Thursday, March 16, 2017

ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. ..


ఎవరైనా మతం మారటానికి ఎన్నో కారణాలు ఉంటాయేమో? హిందువులలో కొందరు అంటరానితనం వంటి కారణాలతో బాధపడి మతం మారితే,కొందరు మారటానికి మరి కొన్ని కారణాలు కూడా ఉండవచ్చు.

ఇంకా మరికొన్ని విషయాలను గమనిస్తే, ఆధునిక కాలంలో ఆచారవ్యవహారాల్లో వచ్చిన విపరీతపోకడలు కూడా ఇందుకు కారణం కావచ్చు.


ఆచారవ్యవహారాల్లో  క్లిష్టత ఉన్నాకూడా ప్రజలు సరళంగా ఉండే విధానాలపట్ల మొగ్గుచూపే అవకాశం ఉంది. 

ప్రజల మంచికోసం ఎన్నో చక్కటి ఆచారవ్యవహారాలను ప్రాచీనులు తెలియజేసారు. 

అయితే ,ఆధునిక కాలంలో కొందరు ఆచారవ్యవహారాలను కొత్తగా మార్చుకుంటూ , తమకుతామే మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా! 

ఆధునిక కాలపు పరిస్థితులను ఊహించిన పూర్వీకులు ఎన్నో విషయాలను తెలియజేసారు. 

ఉదా..కలికాలంలో కేవలం దైవనామాన్ని స్మరిస్తే చాలు ..గొప్ప ఫలితం లభిస్తుందని సడలింపులను తెలియజేయటం జరిగింది. 


 షిరిడి సాయి నవవిధ భక్తులు గురించి తెలియజేసారు. ఇంకా,  భక్తి లేని సాధనములన్ని నిష్ప్రయోజనములని చెబుతూ కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే అని తెలియజేసారు.

సాయిబాబాను కొందరు ఆదిపరాశక్తి అవతారముగా భావించేవారట....

 .భక్తులలో కొందరికి శివునిగా, కొందరికి కృష్ణుడుగా, కొందరికి గురువుగా ,కొందరికి వారివారి ఇష్ట దైవముల రూపములో దర్శనమిచ్చారట.

**************
ఆచార వ్యవహారాలు అవసరమే, అయితే మూఢత్వం పెంచే విధంగా కాకుండా ఎవరి విచక్షణతో వారు పాటించటం అవసరం. 

ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించాలనుకుంటూ  విసుగు వచ్చేలా చేసుకోవటం కాకుండా..తమశక్తికి తగినంతలోనే పూజలు చేస్తూ దైవభక్తి ఎక్కువగా ఉండేలా నిలుపుకోవటం సరైన పద్ధతి అనిపిస్తుంది.


దీనికి సంబందించిన ఒక కధను పెద్దలు తెలియజేసారు. 

ఒక భక్తుడు భక్తి పారవశ్యంలో పూజ చేస్తూ దైవానికి అరటిపండ్లను నివేదించబోయి, భక్తి పారవశ్యంలో అరటిపండ్లను ప్రక్కన పడవేసి వాటి తొక్కలు తీసి దైవానికి నివేదిస్తారు. ఆ భక్తుని భక్తికి మెచ్చిన దైవం అతనికి దర్శనాన్ని అనుగ్రహించారని అంటారు.


 తరువాత కొంతసేపటికి భక్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకుని.. ఈ సారి  పొరపాటు రాకుండా పూజ చేయాలనే తాపత్రయంలో భక్తి కన్నా, పూజను చేసే విధానంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించగా ఈసారి దైవం ప్రత్యక్షం కాలేదట.


 ఈ కధ ద్వారా ఏం తెలుస్తుందంటే,  పూజా విధానాలను, ఆచారవ్యవహారాలను చక్కగా పాటించటం మంచిదే కానీ, దైవంపై భక్తి అన్నింటికన్నా ముఖ్యం..  అని గ్రహించాలి.


శక్తి ఉన్నవారు ఆచారవ్యవహారాలను నిక్కచ్చిగా పాటించుకోవచ్చు. అంత ఓపిక లేనివారు తమకు వీలున్నంతలో పాటించుకోవచ్చు. ఎవరి శక్తిని బట్టి వారు దైవప్రార్ధన చేసుకోవచ్చు. 


అంతేకాని, తమకు శక్తి లేనప్పుడు  మోయలేనంతగా నెత్తిన వేసుకుని విసుగు తెచ్చుకుని..ఆచారవ్యవహారాలను ఆడిపోసుకోవటం న్యాయం కాదు కదా! 


1 comment:

  1. కన్నులు తెరచి కూడా ధ్యానం చేయవచ్చని అంటున్నారు. ధ్యానం చేసేటప్పుడు ఎక్కువసేపు కన్నులు మూసుకుని ఉండలేకపోతే కొంతసేపు తరువాత కన్నులు తెరచి దైవస్మరణ చేసుకోవచ్చు.

    ReplyDelete