koodali

Tuesday, December 29, 2015

కూడలి...........

 
కూడలి తాత్కాలికంగానైనా మూతబడటం చాలా బాధను కలిగిస్తోంది. నేను బ్లాగ్ వ్రాయటం మొదలుపెట్టినప్పటి కొత్తలో కూడలి ద్వారానే అందరికీ మొదట పరిచయమయింది. 

అగ్రిగేటర్ల వల్ల మా బ్లాగులు అందరికీ ఎంతో పరిచయమయ్యాయి. ఇందుకు వారికి ఎన్నో కృతజ్ఞతలు.

అగ్రిగేటర్లు ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా తెలుగు బ్లాగులను ముందుకు తీసుకువెళ్తున్నారని కష్టేఫలే వారి బ్లాగులో చదివాను.

తెలుగు బ్లాగులను ప్రోత్సహిస్తున్న అగ్రిగేటర్లు అందరికి నా కృతజ్ఞతలు. 
............

నా బ్లాగ్ వల్ల అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయేమోనని కొంతకాలం క్రిందట నాకు సందేహం కలిగింది.

అంటే.. బ్లాగ్లో కొత్త టపా పోస్ట్ చేసిన తరువాత నాకు కొత్త ఆలోచనలు రావటం, అందువల్ల టపాలో మార్పులు, చేర్పులు చేయటం నాకు అలవాటు. 

ఇందువల్ల నేను వేసే టపాను పదేపదే పోస్ట్ చేయటం అనే ఇబ్బంది వల్ల అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో? అనే సందేహం వచ్చి టపాలలో మార్పులు,చేర్పులను చేయటం కొంతవరకూ తగ్గించాను.

అయితే,నాకు కంప్యూటర్స్ వాడకం గురించి తెలిసింది చాలా తక్కువ. ఇలాంటి విషయాల్లో ఏం చేయాలో నాకు తెలియదు. 

నా బ్లాగులోని రాతల వల్లగానీ లేక నా బ్లాగ్ వల్లగానీ అగ్రిగేటర్లకు ఏమైనా ఇబ్బంది ఉంటే నా బ్లాగును అగ్రిగేటర్ నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటున్నాను.
..............

కూడలి తిరిగి ప్రారంభమవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. 

ఇంతకుముందు మూసివేసిన అగ్రిగేటర్లు మరియు బ్లాగులు కూడా తిరిగి ప్రారంభమవ్వాలని కూడా మనసారా కోరుకుంటున్నాను.


Monday, December 28, 2015

శాకాహారం..మాంసాహారం..మరికొన్ని విషయాలు..

  
శాకాహార జంతువులను ...మాంసాహార జంతువులను గమనిస్తే ఎక్కువ శాకాహార జంతువులు సాత్వికంగా ఉంటాయి. ఉదా..ఆవు, మేక వంటివి. 

మాంసాహారజంతువులు ఎక్కువగా కోపగుణాన్ని కలిగిఉంటాయి. ఉదా..పులి, సింహం వంటివి.
...................................

మనుషులకు  శాకాహారం వలన అనేక లాభాలున్నాయని, మాంసాహారం వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశాలు ఎక్కువని ఇంతకుముందు ఒక టపాలో చెప్పటం జరిగింది. 

శాకాహారం వల్ల సాత్విక గుణం ఎక్కువయ్యే సుగుణం కూడా ఉంది.

 అయితే,  పూర్వీకులలో కూడా కొందరు మాంసాహారం తీసుకోవటం జరిగింది. ఉదా..రాజులు.. సైనికులు..మొదలైన వారు మాంసాహారాన్ని తీసుకుంటారు. 

ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాలి. సత్వ , రజో , తమో గుణాలు  అని మూడురకాల గుణాలున్నాయి. ఎవరికైనా సాత్విక గుణం ఎంతో అవసరం.

 అయితే, కొన్ని సందర్భాలలో రజో  గుణం కూడా అవసరమే. 

ఉదా..రాజ్యంపైకి దండెత్తి వచ్చిన శత్రువులను ఎదుర్కోవాలంటే..రాజు  సాత్వికంగా ఉండి , నేను యుద్ధం చేయను.. అని చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదు. శత్రువులతో యుద్ధం చేసి రాజ్యాన్ని కాపాడుకోవటం ఎంతో ముఖ్యం.

 యుద్ధంలో ఇతరులను చంపటం ఉంటుంది. ఎవరినైనా చంపాలంటే గుండె కొంచెం కఠినంగా తయారుకావాలి.

పూర్వకాలంలో రాజులు వేటకు వెళ్ళి జంతువులను సంహరించటం, వాటి మాంసాలను భుజించటం జరిగేది. 

ఇంకొక విషయం ఏమిటంటే, దేశంపైకి దండెత్తి వచ్చిన శత్రువులను తరిమికొట్టే సందర్భాలలో రాజు మరియు సైనికులు ...శత్రువులను తరుముతూ దూరప్రాంతాలకు వెళ్ళే సందర్భాలూ ఉండేవి. 

ఇలాంటప్పుడు రాజు మరియు  సైనికుల ఆహారం కోసం... శాకాహారం మాత్రమే కాకుండా ఆ ప్రాంతాలలో దొరికే జంతువులను కూడా వధించి ఆహారంగా తీసుకోవటమూ కొన్నిసార్లు  తప్పనిసరి అయ్యే అవకాశాలున్నాయి. 

ఇలాంటి ఎన్నో కారణాల వల్ల మాంసాహారం కూడా తీసుకోవటం జరిగిఉండవచ్చు.
.......................

కొందరు విదేశీయులను గమనిస్తే వారు తీసుకునే ఆహారంలో ఉప్పు,కారం, మసాళాలు లేని  మాంసాహారం కొంచెం ఉంటే...  ఎక్కువ భాగం శాకాహారం ( సగం ఉడికిన లేక పచ్చి శాకాహారం) ఉండటాన్ని గమనించవచ్చు.


 మరికొన్ని విదేశాల వాళ్ళు మాంసాహారాన్ని ఉప్పు,కారం, మసాళాలు దట్టించి వండుతారు.

మాంసాహారంలో ఉప్పు,కారం, మసాలాలు దట్టించి తినటం వల్ల రజో , తమో గుణాలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

అయితే , ఆహారంలో ఎక్కువ కారం, ఉప్పు, నిలువ ఉంచిన పచ్చళ్ళ వంటి ఆహారాల వల్ల కూడా  రజో , తమో గుణాలు ఎక్కువవుతాయంటారు. 

సాత్విక ప్రవృత్తి కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా ఉప్పు, కారాలను, నిలువ ఉన్న పదార్ధాలను తీసుకోవటాన్ని తగ్గించుకోవాలి లేక వాటిని తీసుకోవటం మానివేయాలి.

 ఇక , మద్యం వంటివాటివల్ల కూడా తామస గుణం బాగా వృద్ధి చెందుతుందంటారు. 
....................

అన్ని జీవులకు వాటి ప్రాణం వాటికి తీపి. మనల్ని ఎవరైనా చిన్న దెబ్బ కొడితేనే నొప్పికి ఓర్చుకోలేక గిలగిలలాడతాము. అలాంటిది ఒక జీవి యొక్క ప్రాణం తీసి ఆహారంగా తీసుకోవటం బాధాకరమే కదా!


ఏమైనా జీవహింస పాపమే. మానవశరీరం మాంసాహారానికి తగినట్లుగా లేదని వైద్యులే స్పష్టంగా తెలియజేస్తుంటే మేము మాంసాహారమే తింటాం..అంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు ? ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంది. ఎవరి కర్మకు వారే కర్తలు.



ఈ లింక్ చదవగలరు.

what are the harmful effects of non veg(food) in nowadays



Thursday, December 24, 2015

పండుగల సందర్భంగా..




దత్తజయంతి..మీలాదె నబి..క్రిస్మస్.. సందర్భంగా శుభాకాంక్షలు.



Wednesday, December 23, 2015

ఓం

పండుగల సందర్భంగా శుభాకాంక్షలు.

సీతా రాముల వారికి వందనములు.

సువర్చలాదేవి ఆంజనేయ స్వామి వారికి వందనములు.

పౌర్ణమి నాడు దత్తజయంతి . 

 శ్రీ అనఘాదేవీ శ్రీదత్తాత్రేయస్వామి వార్లకు వందనములు.

శ్రీపాదశ్రీవల్లభస్వామి వారికి వందనములు..

    దిగంబర! దిగంబర!! శ్రీపాదవల్లభ దిగంబర !!!
       శ్రీపాదరాజం శరణం ప్రపద్యే .

Monday, December 21, 2015

ఓం


ముక్కోటి ఏకాదశి మరియు గీతా జయంతి శుభాకాంక్షలు.
....................

ఏకశ్లోకి మహాభారతము, ఏకశ్లోకి భగవద్గీత..

ఏకశ్లోకి  మహాభారతము.

ఆదౌ  పాండవ  ధార్తరాష్ట్ర  జననం..లాక్షాగృహేదాహనం

ద్యూత స్త్రీ హరణం..వనేవిహరణం..మాత్స్యాలయేవర్తనం

లీలాగోగ్రహణం..రణేచేవిజయం..సంధిక్రియా  జృంభణం

పశ్చాద్భీష్మసుయోదది నాది హననం  యేతన్మహాభారతమ్ 

.................. 

ఏకశ్లోకి  భగవద్గీత

ఓం  యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్ధో ధనుర్ధరః 
తత్ర  శ్రీర్విజయో భూతిర్ధ్రువా  నీతిర్మతిర్మమ.  
.........................

పార్ధాయ ప్రతి  బోధితాం....భగవతా నారాయణేనస్వయమ్  
వ్యాసేన  గ్రధితాం  పురాణమునినా  మధ్యేమహాభారతమ్ 
అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశాధ్యాయినీ
మంబ త్వా మనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ (భవద్దేషిణీమ్)
......................................

నాకు వ్యాకరణం గురించి అంతగా తెలియదు.  


 వ్రాసిన  దానిలో  అచ్చు తప్పులు ..వంటివి   ఉంటే  తెలిసిన వారు  చెప్పగలరు. ( మీకు  అభ్యంతరం  లేకపోతే...) 

  అచ్చుతప్పుల  వంటివి  ఉన్నచో  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను. 
.............................. 

అంతర్జాలంలో వెతికితే  కొన్ని లింకులు ఉన్నాయి. 

My corner for my kids: Eka sloka collection - Ramayanam . 




Friday, December 18, 2015

మాంసము.......మానవాహారము కాదు.

 

ఈ క్రింది విషయాలు ఒక ప్రముఖ వైద్యులు వ్రాసిన పుస్తకంలోనివండి.


భగవంతుడు ఆయా జీవరాశుల నివాసములు, పరిసరములు, వాతావరణము, అంగసౌష్ఠవములను బట్టి విభిన్న ఆహారములను నియమించటం జరిగింది.



భగవంతుని సృష్టి ఎంతో అద్భుతమైనది .


జీవరాశులలో శాకాహారులు, తృణాహారులు, ఫలాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు ఇలా వివిధశాఖలుగా ఏర్పడి ఉన్నాయి,..


మాంసాహారులైన జంతువులకు అందుకు తగినట్లుగా వాడికోరలు అవి ఉంటాయి.ఉదా.. సింహము, పులి, నక్క, వగైరాలు. భగవంతుడు వాటికి మాంసాహారానికి అనువైన అంతరావయములను, జీర్ణాదిరసములను అమర్చారు.


మాంసము త్వరగా కుళ్ళిపోతుంది.అది ప్రేగులలో నిలువయుండుట వల్ల అనేక రోగక్రిములు ప్రవేశించే అవకాశమున్నది. కనుక త్వరగా జీర్ణమై మలము వెలువరించబడుటకు గానూ ,కుఱుచైన జీర్ణకోశము, మలకోశముల ఏర్పాటు జరిగింది.


వాటి ప్రేగుల నిడివి జంతువులను బట్టి ఉంటాయి., ఉదా..పెద్దపులి, సింహము వంటి వాటికి 10 అడుగుల పొడవు మాత్రము ఉంటాయి. అందువల్ల ఈ మృగములు మాంసమును భుజించిన ఐదారుగంటలకే మలవిసర్జన చేస్తాయట.


అదే మానవుల జీర్ణమండలము, జీర్ణాదిరసములను పరిశీలించినప్పుడు అవి మాంసాహారమునకు విరుద్ధముగా ఏర్పాటై ఉన్నాయి.మానవ జీర్ణమండలము దాదాపు 30 అడుగుల పొడవుంటుందట.

అందువల్ల 24 గంటలకు గానీ మలవిసర్జన జరుగదు ,మాంసము 24 గంటలు ప్రేవులలో ఉండటం వల్ల అది కుళ్ళిపోయి దుర్వాయువులు వస్తాయి.


ఆ గాస్ వల్ల గాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, నులిపురుగులు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

ఇంకా అనేక వ్యాధులు వచ్చే అవకాశముందటున్నారు. రక్తం పులిసి చెడిపోయి యూరిక్ యాసిడ్ గా తయారవుతుందట.


అంతేకాక , రక్తం చిక్కబడిపోవటం . అందువల్ల కీళ్ళనొప్పులు, గుండెజబ్బులు, మూత్రపిండాలలో రాళ్ళు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


మాంసాహారము తమోగుణమును కలిగిస్తుంది.. అందువల్ల ఉద్రేకము, కోపము, అశాంతి వంటివి పెరుగుతాయి. అందుకని శాకాహారమే మానవులకు మంచిదని చెప్పారు .

ఎక్కువగా పండ్లు ,పచ్చి కూరగాయలు వంటివి తినాలి..మితిమీరి వండిన ఆహారపదార్ధాలు , ఎక్కువకాలం ఫ్రిజ్లలో నిలువ ఉన్నవీ వంటి
 ఆహారపదార్ధాలు తినకూడదు.

యిలా ఎన్నో విలువైన విషయాలను చెప్పటం జరిగింది.

Wednesday, December 16, 2015

వైద్యం..కొన్ని విషయాలు...


 
ఇంతకు ముందు మేము ఉన్న ఊరిలో .. ఇరుగుపొరుగు ఇళ్ళల్లో  ఒక లేడీ డాక్టర్ గారు లివర్ వ్యాధి వల్ల మరణించారు. ఆమె గమనించేసరికే వ్యాధి ముదిరి పరిస్థితి చేయిదాటి పోయిందట.


ఇంకొక ఆమె  కాన్సర్ వ్యాధితో మరణించారు.  కాన్సర్ అని తెలిసేవరకూ ఆమె ఆరోగ్యంగానే ఉండేవారు. వ్యాధి ఉన్న లక్షణాలేవీ తెలియలేదు. కాన్సర్ అని తెలిసిన కొన్ని నెలలకే ఆమె మరణించారు.


ఇప్పుడు మేము ఉన్న ఊరిలో .. కొన్ని రోజుల క్రిందట మా వీధిలో ఒకాయన లివర్ వ్యాధి వల్ల సడన్ గా మరణించారు. అంటే, మూడునెలల క్రితం మాత్రమే ఆ వ్యాధి ఉన్నట్లు వాళ్ళకు తెలిసిందట. 


 కిడ్నీ, కాన్సర్ వ్యాధిన బారిన పడుతున్న వారిలో పిల్లలు, మధ్యవయస్కులు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా జబ్బులు వస్తున్నాయి.


ఇవన్నీ గమనించిన తరువాత ... ఈ రోజుల్లో వ్యాధులు బాగా పెరుగుతున్నాయనిపించి కొన్ని విషయాలను వ్రాసాను. 

అయితే ,  అనారోగ్యాలు తక్కువగా వచ్చేవారు కూడా సమాజంలో ఉన్నారు.

వ్యాధులు రావటానికి గల కారణాలను గుర్తించి వీలైనంతలో జాగ్రత్తలు పాటించితే అనారోగ్యాలు రావటం తగ్గుతాయి.
..........................

ప్రాచీనకాలంలో ఆయుర్వేదంలో  గొప్పప్రావీణ్యత కలిగిన సుశ్రుతుడు, చరకుడు వంటి గొప్పవైద్యులు ఉండేవారు. సుశ్రుతుడు ఆ రోజుల్లోనే శస్త్రచికిత్సలు చేయటంలో గొప్ప నైపుణ్యం కలిగినవారంటారు. 


ఇక వైద్యులైన అశ్వనీకుమారులు ..చ్యవన మహర్షి  యొక్క అంధత్వాన్ని పోగొట్టి, యవ్వనవంతునిగా చేసిన కధ చాలామందికి తెలుసు.


 రామాయణంలో హనుమంతులవారు  సంజీవని మూలిక తేవటం..లక్ష్మణుడు కోలుకోవటం  జరిగింది.


 ఇవన్నీ గమనిస్తే ప్రాచీనకాలంలోనే  వైద్యశాస్త్రం ఎంతో గొప్పగా ఉండేదని తెలుస్తుంది.


 ప్రాచీనకాలపు ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఈ రోజుల్లో నిర్లక్ష్యానికి గురయింది. ఎంతో విజ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నాం.

...................

ఇంగ్లీష్  వైద్యం వల్ల కూడా ఉపయోగాలున్నాయి.

 ఎన్నో రోగాలను తగ్గించటంలో, ఎవరికైనా విపరీతంగా నీరసం వచ్చినప్పుడు సెలైన్ ఎక్కించటానికి, ఆపరేషన్స్ అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది.

...............

హోమియో వైద్యాన్ని చాలామంది నమ్మరు. అయితే ,  హోమియో కూడా బాగా పనిచేస్తుంది.


 ప్రతిభ  మరియు అనుభవజ్ఞుడైన వైద్యుని వద్దకు వెళ్ళి ...వారు చెప్పిన సలహాలను చక్కగా పాటిస్తే అనారోగ్యం తగ్గే అవకాశం ఉంది.


నేను చిన్నతనంలో టాన్సిల్స్ వల్ల చాలా బాధపడ్డాను. ఇక, వేసవిసెలవులలో నాకు టాన్సిల్స్ సర్జరీ చేయించటానికి మా పెద్దవాళ్లు సిద్ధమవగా , ఒక హోమియో వైద్యులు పరిచయమయి , టాన్సిల్స్ తగ్గటానికి హోమియో మందులు ఇవ్వటం జరిగింది. 


అంతే టాన్సిల్స్ బాధ తగ్గిపోయింది. ఇప్పటివరకూ మళ్లీ ఇబ్బంది రాలేదు.


 మాకు అనారోగ్యాలు తక్కువగానే వచ్చాయి. దైవానికి అనేక కృతజ్ఞతలు.



ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది లింకులను చూడవచ్చు.


Anatomy in ancient India: a focus on the Susruta Samhita.



Chyavana - Wikipedia, the free encyclopedia



అయితే, ఈ రోజుల్లో కూడా కొందరు ..ఆయుర్వేదం ద్వారా ఎన్నో వ్యాధులను తగ్గిస్తున్నట్లుగా వార్తల ద్వారా తెలుస్తోంది.


Sri Narsipura Subbaiah Narayana Murthy, A Medicine Man ...




Breast cancer Best Ayurvedic treatment By Rajiv Dixit ...



Cure for all Eye Problems - Baba Ramdev - YouTube


..............................

Anti-cancer: Rosy periwinkle - The Living Rainforest The ...





Thursday, December 10, 2015

వ్యాధులు...తెచ్చిపెట్టుకున్న అవయవాలు.. ఆరోగ్యమే మహా భాగ్యమ్..


 
ఈ మధ్యకాలంలో ..కిడ్నీ, లివర్..వంటి వ్యాధుల వలన అవయవాలు పాడయ్యి, మందులపై ఆధారపడి జీవచ్చవంలా బ్రతుకుతున్నవారు ఎందరో ఉన్నారు.  

ఎందరో వ్యాధిగ్రస్తులు అవయవ దాతల  కోసం ఎదురుచూస్తున్నారు. 

 అయితే, అవయవదానం పట్ల కొందరిలో కొన్ని అపోహలున్నాయి. ఈ అపోహలు అవసరం లేదు. 

వ్యక్తుల మరణానంతరం  వారి  అవయవాలను ఇతరులకు అమర్చటం వల్ల ఎందరికో ఉపయోగం కలుగుతుంది.


దధీచి మహర్షి లోకకల్యాణం కొరకు తన శరీరాన్ని దానం చేసారని గ్రంధాల ద్వారా తెలుస్తోంది.

మనుషులు మరణానంతరం తమ అవయవాలను దానం చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది.  


  పశుపక్ష్యాదులశరీరాలు  మరణానంతరం కూడా ఇతరులకు ఉపయోగపడతాయి.  
మనుషుల శరీరం  మరణానంతరం  ఎందుకూ పనికిరాదని కొందరు భావిస్తారు. 


అయితే  మనుషులు కూడా  అవయవదానం చేయటం ద్వారా ... మరణానంతరం  కూడా   ఇతరులకు సహాయాన్ని అందించవచ్చు.
...............

ప్రపంచంలో ..కళ్లు లేనివారు, వికలాంగులు ఎందరో ఉన్నారు. 

  ఆధునిక విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని చెపుతున్న ఈ రోజుల్లో ఇలాంటి  సమస్యలకు ఏమైనా  పరిష్కారం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. 


ఈ మధ్యకాలంలో ..కిడ్నీ, లివర్..వంటి వ్యాధుల వలన అవయవాలు పాడయ్యి, మందులపై ఆధారపడి జీవచ్చవంలా బ్రతుకుతున్నవారు కూడా  ఎందరో ఉన్నారు.


ఇలాంటి వ్యాధిగ్రస్తులు ...ఇతరుల నుంచి  అవయవదానం కోసం ఎదురుచూసే అవసరం లేకుండా .... శాస్త్రవేత్తలు  శరీరావయవాలను పోలిన యంత్రాలను తయారుచేస్తే బాగుంటుందనిపిస్తుంది.

అయితే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు.

 కిడ్నీ పాడయిన వారికి కిడ్నీలా పనిచేసే చిన్న యంత్రం తయారుచేసే ప్రయత్నాలు  సఫలీకృతమవుతున్నాయని  ఈ మధ్యనే వార్తలు వచ్చాయి. 


 ఇలాంటి యంత్రాలు తయారుచేస్తే కిడ్నీదాతల కోసం ఎదురుచూస్తున్న ఎందరో రోగులకు   ఉపశమనం కలుగుతుంది. అవయవదాతల కొరకు ఎదురు చూసే అవసరం ఉండదు.

( ఆధునిక టెక్నాలజీని ఇలాంటి ఉపయోగకరమైన విషయాల కొరకు ఉపయోగిస్తే ఎంతో మంచిది...... ఇలాంటివి కనిపెట్టే వారు ఎంతో గొప్పవారు.)
....................

అయితే, ఎంతయినా సహజమైన అవయవమే గొప్పది. తెచ్చిపెట్టుకున్నవి సహజమైన అవయవాల వలె ఉండవు.

 తెచ్చిపెట్టుకున్న  అవయవాలతో  ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 

అయితే , అనారోగ్యం వల్ల అవయవాలు పాడై.. ఇక వేరే దారిలేనప్పుడు  తెచ్చిపెట్టుకున్న అవయవాలు  అవసరమే.

అందువల్ల..ఎవరైనా  అనారోగ్యం రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం ఎంతో అవసరం. 

ఆరోగ్యమే మహా భాగ్యమని  పెద్దలు తెలియజేసారు కదా!



Monday, December 7, 2015

ఓం..

 ఓం..
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వందనములు.

బ్రహ్మదేవునికి వందనములు.
విష్ణుదేవునికి వందనములు.
ఓం నమఃశివాయ.


Friday, December 4, 2015

అప్పుడు ..ఇప్పుడు .. కొన్ని విషయాలు ...

 
 
ఈ మధ్య కాలంలో  కిడ్నీ, కాన్సర్, లివర్..వంటి వ్యాధులు అధికమవటానికి అనేక కారణాలున్నాయి. 
................

పాతకాలంలో పంటలు పండటానికి సహజ ఎరువులను మాత్రమే వాడేవారు. 

ఇప్పుడు రసాయన ఎరువులను వాడుతున్నారు.
............

 ఇంట్లో గిన్నెలు శుభ్రపరచటానికి మట్టి, బూడిద, సున్నిపిండి, కుంకుడురసం వంటివి వాడేవారు. ఈ పదార్ధాలు పొరపాటున గిన్నెలపై మిగిలిఉండి ఆహారంతోపాటు శరీరంలో ప్రవేశించినా కూడా హాని ఏమీ జరగదు. 

ఇప్పటి రోజుల్లో పాత్రలు శుభ్రం చేయటానికి రసాయనాలు కలిసిన వాటిని ఉపయోగిస్తున్నాం. 

పాత్రలను ఎంత శుభ్రం చేస్తున్నా చాలాసార్లు ఆ అవశేషాలు పాత్రపైనే మిగిలిఉంటున్నాయి. 

ఆ పాత్ర ద్వారా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ రసాయనాలు కూడా శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంది.
........................

పాతకాలంలో మట్టి, రాగి.. వంటి  పాత్రలను ఎక్కువగా వాడేవారు. 

ఈ రోజుల్లో మట్టి కూడా కలుషితం అవుతోంది కాబట్టి మట్టితో  పాత్రలు తయారుచేసినా ఉపయోగం లేదనిపిస్తోంది.

ఈ రోజుల్లో ఏవేవో కోటింగులు వేసిన పాత్రలను వాడుతున్నారు. ఇలాంటి పాత్రలలో  ఆహారాన్ని  ఎక్కువ వేడివద్ద వండకూడదట.
  ......................

 పాతకాలంలో  త్రాగటానికి, ఆహారాన్ని వండటానికి  చెరువులలో నీటిని వాడేవారు. చాలా ఇళ్ళల్లో నూయి కూడా ఉండేది. ఆ నీరు స్వచ్చంగా ఉండేది. 

ఈ రోజుల్లో అయితే కొన్ని పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్ధాలతో కూడిన నీటిని నదులలో, చెరువులలో కలిపేస్తున్నారు. 

రసాయన వ్యర్ధాలను  పనికట్టుకుని చెరువులలో, నదులలో కలపకపోయినా  వర్షాలు వచ్చినప్పుడు ఈ రసాయనా వ్యర్ధాలు వర్షపు నీటితో పాటు వచ్చి  చెరువులలో, నదులలో కలిసే అవకాశం కూడా ఉంది.

 త్రాగటానికి, ఆహారాన్ని తయారుచేయటానికి కలుషితమైన నీటిని వాడటం వల్ల శరీరభాగాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
........................

పాత రోజులలో   ఇంటి శుభ్రతకు  ఆవుపేడ , మట్టి వంటివి వాడేవారు . ఆ రోజుల్లో  బాత్రూమ్స్  ఇంట్లో కాకుండా ఇంటికి కొంచెం బయట ఉండేవి .

 సింధు నాగరికత రోజుల్లోనే ఇళ్ళ నుండి  నీరు  బయటకు పోవటానికి  చక్కటి నీటిపారుదల వ్యవస్థ ఉన్నట్లు త్రవ్వకాల ద్వారా తెలిసింది. 


ఈ రోజుల్లో  ఇంటి  శుభ్రతకు ఎన్నో ఆసిడ్లను వాడుతున్నాము.

 ఈ రసాయనాలు ఇంటినుంచి డ్రైనేజ్లోకి వెళ్లి భూమిలో ఇంకటం, చెరువులలోనూ, నదులలోనూ కలవటం జరుగుతుంది. ఇందువల్ల  భూమి, నీరు కలుషితం అవుతోంది.
........................

 ఇక కొన్ని పరిశ్రమల వల్ల గాలి కూడా కలుషితం అవుతోంది. 
..................

కంప్యూటర్స్, ఏసీలు, ఫ్రిజులు..వంటి ఆధునిక పరికరాల  వాడకం  వల్ల ఓజోన్ పొర  పలుచబడుతోందని అంటున్నారు.

 ఓజోన్ పొర పలచబడితే అనేక దుష్పరిణామాలు కలుగుతాయంటున్నారు. 
......................
ఎన్నో విధాలుగా  గాలి, నీరు, భూమి..కలుషితం అవుతున్న ఈ రోజుల్లో  వ్యాధులు పెరగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
...........................

ఆధునికులు టెక్నాలజీకి బందీలయిపోయారు.

 టెక్నాలజీని ఎంత వరకూ అవసరమో అంతవరకే వాడుకుంటే కొన్ని దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. 
......................

Images for sindhu drainage system



Wednesday, December 2, 2015

అభివృద్ధి చెందుతున్న వాతావరణ వైపరీత్యాలు, వ్యాధులు...

 
 
కొన్ని రోజుల క్రితం మా ఇంటికి తెలిసిన వాళ్ళు ( ఫ్రెండ్స్) వచ్చి వెళ్లారు.

వాళ్ళ 6 సంవత్సరాల అబ్బాయికి కిడ్నీ వ్యాధి వచ్చింది. మా ఊరిలో వైద్యుల వద్ద చూపించుకోవటానికి వచ్చారు. 

అంత చిన్న బాబుకు కిడ్నీ వ్యాధి రావటం ఏమిటో ? చాలా బాధనిపించింది. 

రక్త పరీక్ష చేయించుకునేటప్పుడు బాబు భయంతోనూ, నొప్పితోనూ  బాగా ఏడ్చాడని చెబుతుంటే ఎంతో బాధనిపించింది.

 పాతకాలంలో కాన్సర్..  వంటి వ్యాధుల గురించి  అరుదుగా వినేవాళ్ళం.

ఈ రోజుల్లో  ఎందరో చిన్నపిల్లలు కూడా  కిడ్నీ, కాన్సర్  వంటి  వ్యాధుల బారిన పడుతున్నట్లు వింటున్నాం.

ఆధునిక కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, రసాయన పురుగుమందులతో పెంచుతున్న ఆహారధాన్యాలు, శుభ్రత కోసం ఇంట్లో విరివిగా వాడే రసాయనాలు భూమిలో, నీటిలో కలవటం ... వంటి అనేక కారణాల వల్ల ... 

 అభివృద్ధి పేరుతో గాలిని, నీటినీ కలుషితం చేయటం...వంటి అనేక కారణాల వల్ల  కిడ్నీ వ్యాధులు, కాన్సర్లు, లివర్ పాడవటం..వంటి అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు.


ఎంతసేపూ టెక్నాలజీ పెరగటం గురించి, డబ్బు సంపాదించటం గురించి, ఇతరగ్రహాలపైకి వెళ్ళటం ..వంటి విషయాల గురించి తాపత్రయపడుతున్నారే గానీ ,  సమాజంలో పెరుగుతున్న వ్యాధుల విజృంభణ, పర్యావరణ కాలుష్యం వల్ల కలుగుతున్న విపరీతమైన వాతావరణ మార్పులు వంటి సమస్యల గురించి పెద్దగా దృష్టి పెట్టడం లేదు.


 పర్యావరణ పరిరక్షణ  గురించి అప్పుడప్పుడు కొన్ని సమావేశాలు జరిపి చర్చించుకోవటంతోనే సరిపెట్టుకుంటే తరువాత చింతించవలసి వస్తుంది.

ఈ సమస్యలను అశ్రద్ధ చేస్తే జీవుల మనుగడకే ప్రమాదం కదా!