koodali

Friday, July 31, 2015

గురుపూర్ణిమ

ఓం

 గురువులకు  వందనములు.



Monday, July 27, 2015

ఉత్తర రామాయణం ..

 
ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - 

(కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)

రామరాజ్యం.. సీత గురించిన నింద.. అడవుల పాలైన సీత.. ముని ఆశ్రమం, కుశలవులు.. రాజసూయం.. రామాయణ గానం..జానకీదేవి కళంక రహిత..సీత భూప్రవేశం..లక్ష్మణునికి ధర్మ సంకటం.. లక్ష్మణుడి యోగ సమాధి.. రాముని నిర్ణయం.. రామావతార పరిసమాప్తి..

శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. 

ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు.
 అందుకు సీత " నాధా గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. 

అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే వ్యాకులచిత్తుడవుతాడు.

 అక్కడనుండి సభామంటపానికి వెళ్ళిన రాముడిని విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజు, మొదలైన వారు హాస్య కథలు చెప్పి రాముడిని సంతోషపరుస్తారు.

 రాముడు ప్రసన్నుడై భద్రునితో " భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు. 

అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు.

 రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు.


రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ ఆమెపై అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. ప్రజాభీష్టం లేని పరిపాలన సూర్యుడులేని పగలు వంటిది. ఇప్పుడు నాకు ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడ్డం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు మున్యాశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు. 


గంగానదిని దాటిన పిదప మున్యాశ్రమతీరంవద్ద లక్ష్మణుడు సీతాదేవితో  " తల్లీ! నా పాపాన్ని క్షమించు. నిన్ను నేను ఇక్కడకు తీసుకువచ్చినది ఈ తీరంలో వదిలి వెళ్లడానికే గాని తిరిగి అయోధ్యాపురికి తీసుకు వెళ్ళడానికి కాదు" అని అసలు సంగతి చెప్పగా,


 ఆమె మూర్చపోయి తేరుకొని "నాయనా సౌమిత్రీ! నేను కష్టాలు అనుభవించడానికే పుట్టాను అని అనిపిస్తున్నది.... అప్పుడు అరణ్యాలలో భర్త తోడుతో గడిపాను. ఇప్పుడు ఒంటరిగా ఉండగలనా? నీభర్త నిన్నెందుకు విడిచిపెట్టాడని అడిగే ముని పత్నులకు ఏమి జవాబు చెప్పేది? సరే. విధిరాత అనుభవింపకతప్పదు. ఆయన మాటను గౌరవిస్తానని చెప్పు. నా నమస్కారాలు తెలియచెయ్యి. " అంటుంది. 

లక్ష్మణుడు ఆమె పాదాలకు మొక్కి ప్రదక్షిణం చేసి వెళ్ళలేక వెళ్లలేక గంగా తీరం దాటి వెడతాడు.

సీత అతను వెళ్ళేంతవరకూ అక్కడే ఉండి పెద్దగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. 

ముని బాలకుల ద్వారా ఈ సంగతి తెలుసుకొన్న వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి" అమ్మాయీ! నీవు జనకుని కూతురువు. దశరధుని కోడలివి. రాముని ఇల్లాలువు. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తితో సర్వం గ్రహించాను. నీవు నిశ్చింతగా ఉండు. ఇక్కడి మునిసతులందరూ నిన్ను కన్న కూతురివలె చూసుకొంటారు. " అని ఓదారుస్తాడు.

 ఆయన ఆశ్రమంలో ఉన్న అందరినీ పేరు పేరునా పిలచి జానికీ దేవికి ఎలాంటి కష్టం కలుగకుండా చూసుకొనే భాధ్యతను అప్పగిస్తాడు. 

అక్కడ కొంతకాలానికి జానకీ దేవి ఇద్దరు బాలలకు జన్మనిస్తుంది. వారు లవకుశనామధేయులై దినదిన ప్రవర్దమానులౌతూ అటు వేద విద్యలోనూ, ఇటు క్షాత్ర విద్యల్లోనూ తిరుగులేని బాలురుగా ప్రకాశిస్తుంటారు.

తరువాత,  లవకుశులు రామకధను గానం చేయటం..రాముడు వినటం..మొదలైన విషయాలు జరుగుతాయి.

తరువాత, కొన్ని సంఘటనల తరువాత ..  సీతాదేవి అవతారసమాప్తి జరుగుతుంది . రాముడి దుఃఖానికి అంతే లేదు... 

అప్పుడు బ్రహ్మ వారించి "రామా ! ఇది నీకు తగదు. నిన్ను స్వర్గధామంలో తప్పక కలుసుకొంటుంది. నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది...అంటూ ఎన్నో విషయాలను తెలియజేస్తారు.

 లవకుశులతో రాముడు అయోధ్యకేగాడు. కాలం ఎవరికోసమూ ఆగదు.

తరువాత కొంతకాలానికి ఎన్నో సంఘటనలు జరగటం ... వారి సంతానానికి రాజ్యాన్ని అప్పగించటం.. మరి కొన్ని సంఘటనల తరువాత..  రామావతారపరిసమాప్తి జరిగింది.
........................ 

రామాయణము - వికీపీడియా


.. నుంచి  ఎన్నో విషయములు  చదవవచ్చు.   
...................... 
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను . 


Tuesday, July 21, 2015

ధర్మము అధర్మంపై విజయాన్ని సాధించిన కధ రామాయణము....

 
ఓం లీలాకల్పితబ్రహ్మాండమండితాయై నమః 
ఓం శ్రీ సుదాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమః
 ఓం సూర్యమండలమధ్యస్థాయైనమః 
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః 
.....
అగస్త్యుడు ఆదిత్యహృదయాన్ని రామునికి ఉపదేశించారు. 

శ్రీ దేవీ భాగవతము ద్వారా నారదుడు శ్రీ రామునితో నవరాత్రవ్రతం చేయించారని తెలుస్తుంది. 

విజయదశమినాడు వానరసేనతో లంకాపట్టణం పైకి దండయాత్ర సాగించారు.సేతు బంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు.
....................... 
యుద్ధానికి సిద్ధం..విభీషణ శరణాగతి....భల్లూక, వానర సేన....సాగరంపై వారధి....రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగించాడు ఇంద్రజిత్తు..నాగపాశ విమోచన...రాక్షస వీరుల మరణం..రావణునికి పరాభవం.....ఇంద్రజిత్తు మరణం...రామరావణ యుద్ధం ఆరంభం...లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ...మూర్ఛనొందిన లక్ష్మణుని రక్షణ కోసం ఓషధీ పర్వతాన్ని తీసుకువచ్చిన హనుమంతుడు....రాముని చేత రావణ సంహారం.... 

(రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. )
...................... 
 పిదప విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు.
 విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతకు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

రాముడు "సీతా, ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను. రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను. కలక బారిన కనులకు దీపం వలె నీవు నాకు చాలా బాధాకరంగా కనుపిస్తున్నావు. నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని కఠినంగా మాట్లాడాడు.


(సీత అంటే రామునికి ఎంతో ప్రేమ. సీతాపహరణం తరువాత రాముడు సీతకోసం ఎంతో విలపించాడు.సీతను తలచుకుని దుఃఖించాడు. అయితే, సీతపట్ల ఎంతో ప్రేమ ఉన్నాకూడా దాచుకుని, సీతతో కఠినంగా మాట్లాడవలసివచ్చింది.)

రాముని మాటలు విని సీత దుఃఖంతో బావురుమంది. "ఆర్యపుత్రా, వీరాధివీరా, నీవు పామరునివలె మాట్లాడుతున్నావు. రావణుడు నన్ను తాకిన దోషం నాది కాదు. దైవానిది. నా హృదయం నీమీదే లగ్నం అయి ఉన్నది. నేను జనకుని పెంపుడు కూతురిని. భూమి సుతను. నా భక్తినీ శీలాన్నీ విశ్వసించలేక పోతున్నావా?" అని విలపించింది.

సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, కళంకిని అనిపించుకొని నేనింక బ్రతుకలేను. నా సుగుణాలని కీర్తించని నా భర్త నలుగురిముందు నన్ననరాని మాటలన్నాడు. అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది.

 సీత అవనత శిరస్కయై రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయాలి" అని పలికి మంటలలోనికి నడచింది. 

అందరూ హాహాకారాలు చేశారు. 
అప్పుడు బ్రహ్మ రాముని సమక్షంలో నిలిచి "రామా నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? ప్రాకృతునిలా సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. నీవు విష్ణువు అవతారానివని చెప్పాడు.

అగ్ని సీతను వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు. సీత అప్పుడు ఉదయసూర్యబింబంలా ఉంది. "రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన సాధ్వి. ఈమెను అవశ్యం పరిగ్రహించు. నాకడ్డు చెప్పవద్దు. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అని చెప్పాడు. 

రాముడు "సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీత చేతినందుకొన్నాడు.
........
రాముని కోరికపై ఇంద్రుడు చనిపోయిన వానరులందరినీ బ్రతికించాడు. సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. 

అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు. 

విభీషణుడు, వానరులు తోడు రాగా పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు.

 దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు. 

 హనుమంతుడు నందిగ్రామం చేరుకొని , భరతునికి సీతారామలక్ష్మణుల పునరాగమన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు.

 రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రామునికి, సీతకు, లక్ష్మణునికి ప్రణమిల్లాడు.

 సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేకొనమని  భరతుడు శ్రీరాముని ప్రార్ధించాడు. 

భరతుడే సారధ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతోఅయోధ్యలోనికి ప్రవేశించారు.

 తల్లులకు, పెద్దలకు, గురువులకు మ్రొక్కారు. 

వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.

శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయమయ్యింది.  పట్టాభిషేకం వైభవంగా జరిగింది.

శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. 

అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది.

 సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. 

అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. 

రాముని సెలవు తీసికొని విభీషణుడు లంకకు, వానరులు కిష్కింధకు తరలిపోయారు.

యువరాజుగా ఉండడానికి లక్ష్మణుడు సమ్మతించలేదు. భరతునకు యౌవరాజ్యాభిషేకం చేశాడు రాముడు.

 తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన  చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు.

వాల్మీకి రచించిన  రామకథను చదివినవారు, విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్యసంపదలను పొందుతారని , ఇంకా  ఎన్నో విషయాలను పెద్దలు తెలియజేసారు . 
........................ 
రామాయణాన్ని అంతర్జాలం ద్వారా  చదవవచ్చు.

ఈ లింక్ వద్ద ఏకశ్లోకి రామాయణము. చదవగలరు.

వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


Friday, July 17, 2015

ఎంతో సుందరమైనది..రామాయణము..

 
. మహాబలి అయిన హనుమంతుడు శివాంశ గలవాడు. 

ఒక అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. కేసరి అనే అతను చాలా బలవంతుడు. అతను మాల్యవంతమనే పర్వతం మీద ఉండేవాడు. 

శంబసాదనుడనే ఒక రాక్షసుడు యజ్ఞయాగాలను భంగం చేస్తూ దేవ ఋషులను హింసించేవాడు.

కేసరి, మునుల కోరికపై శంబసాదనుడితో యుద్ధం చేసి అతన్ని నిర్జించి దేవ ఋషులకు పీడ తొలిగిస్తాడు. 

సజ్జన స్వభావం గల కేసరికి అంజని అనే భార్య ఉంది. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. 

అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. 

కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.

 పుట్టుకతోనే దివ్యతేజస్సు కలిగిన ఆ బాలుడిని అంజనీ పుత్రుడు కనుక ఆంజనేయుడని పిలిచేవారు.

హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు.

 సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. 

వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.

హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. 

అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు.

గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు.
........

 సీతాదేవి జాడ తెలుసుకోవటం కోసం బయలుదేరినప్పుడు శ్రీరాముడు తన ఉంగరాన్ని సీతాదేవికి  ఇవ్వమని హనుమంతునికే ఇచ్చారు.

ఎదురైన అడ్దంకులను అధిగమించి  మహాబలి ఆంజనేయుడు  లంకను చేరుకున్నాడు.

కొన్ని సంఘటనల  తరువాత....

సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు.

 అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

తరువాత,

 రావణుడు..  సీతమ్మను భయపెట్టటం కూడా చూసాడు .  

తరువాత, హనుమంతుడు  సీతమ్మతో సంభాషించి ,రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. 

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. 

వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. 

చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. 

సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. 

రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. 

కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

చూడబడెను  సీతమ్మ ..అంటూ ఆనందంతో  ఉప్పొంగుతూ రాములవారికి  మరియు అక్కడ ఎదురుచూస్తున్న వారికీ శుభసందేశాన్ని వినిపించాడు.

సీతమ్మ ఇచ్చిన చూడామణిని రాములవారికి అందించాడు.
...............
( చాలా విషయాలను అంతర్జాలం నుంచి సేకరించి వ్రాయటం జరిగిందండి.)


Wednesday, July 15, 2015

రామాయణంలో వాలి వధ.....

 
శ్రీరాముడు  వాలిని  చంపటం  గురించి  కొందరు  తప్పుగా  మాట్లాడతారు. 

వాలి  మరణించేముందు  అడిగిన సందేహాలకు రాములవారే సమాధానాలు చెప్పి సంశయాలను తీర్చారని పెద్దలు తెలియజేసారు. కొన్ని  విషయాలు....

వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు –

 ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.

నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవసరం.   ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు.

 నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు.

 ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.

 నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. 

నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. 

కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు.

 రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. 

ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.

వాలి చివరి కోరికలు..

వాలి ఇలా అన్నాడు– రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.

తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.

అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. 

అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. 

అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు.

(ఈ విషయాలు అంతర్జాలంలో వాలి-వికీపీడియా ద్వారా చదివినవి.)
............

ఇక్కడ వ్రాసిన విషయాలు, వాల్మీకి రామాయణము .. నుండి చూసి వ్రాసాను. ( Chenna Kesava Kumar Bonu గారి  బ్లాగ్ లో చదివాను  ).
(  వారికి ఏమైనా అభ్యంతరం ఉంటే తొలగించుతాను .)

వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దెగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు... 

.బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. 

అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణలు విడిచిపెట్టాను.అని సుగ్రీవుడు చెబుతాడు.
............ 

రాముడు వాలితో చెప్పిన కొన్ని విషయాలు..నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము.

 కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు .

మరి కొన్ని విషయాలు...

వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, 

సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు.

కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. 

అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు.

 రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం.

 అలాగే వాలికి రావణాసురుడికి స్నేహం ఉంది, వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.... 

.దాని ప్రకారం వాలి అనుభవించే స్త్రీని రావణుడు అనుభవించచ్చు, వాలికి శత్రువు రావణుడికి శత్రువే........అలా కొన్ని విషయాలలో ఒప్పందం కుదుర్చుకున్నారు .
.............

ఇవన్నీ  చదివిన తరువాత నాకు ఏమనిపించిందంటే,

బిలం వద్ద నుంచి సుగ్రీవుడు వెంటనే తిరిగి వెళ్ళిపోలేదుకదా ! చాలాకాలం వాలికోసం ఎదురు చూశాడు.

 (కొందరు నెలరోజులు అని, కొందరు సంవత్సరం ఎదురుచూసాడని వ్రాసారు.) 

  అలా చాలాకాలం ఎదురుచూసిన  సుగ్రీవుడు, వాలి  చనిపోయాడని  భావించి , వాలిని  చంపిన  రాక్షసుడు  బయటకు  రాకుండా  గుహను  మూసి  వెళ్ళిపోవటంలో ఆశ్చర్యం  ఏమీలేదు. 

వాలి అపార్ధం  చేసుకున్నట్లు లోకంలో  చాలామంది ఇతరులను  అనుమానించటం  కూడా   జరుగుతుంటుంది.

వాలి  సుగ్రీవుని  అర్ధం  చేసుకుని  క్షమించి  ఉంటే  సరిపోయేది.

  సుగ్రీవుడు   తాను   పొరపాటు  చేసానని  ఒప్పుకున్నా  కూడా,   వాలి  సుగ్రీవుని  యందు  అనుమానంతో    అతనిని క్షమించకుండా  అతని  భార్యను  తాను  వివాహం  చేసుకోవటం,  సుగ్రీవుని  చంపటానికి  ప్రయత్నించటం .....  అలా  వ్యవహారాన్ని  తెగేవరకూ  లాగి  తన  ప్రాణం  మీదకు  తెచ్చుకున్నాడు. 
.............

ఇక, రాముడు  చెట్టు  చాటునుండి  వాలిని చంపటం  గురించి  కొందరు  తప్పుపడతారు.  అందులో  తప్పేముంది? 

 ఉదాహరణకు .. ఎవరైనా, తమకు  హాని చేయటానికి ప్రయత్నించే  జంతువునో  లేక  వ్యక్తినో  తుపాకీతో  కొట్టాలంటే, ఏ చెట్టు  చాటు నుండో  లేక  చెట్టు  ఎక్కో  తుపాకీ పేల్చటానికి ప్రయత్నిస్తారు కానీ, ఆ బలమైన జంతువుకు  లేక  బలమైన వ్యక్తికి  ఎదురుగానే  నుంచుని  తుపాకీ పేల్చాలని రూలేమీ లేదు కదా !

కొన్ని ప్రత్యేక సందర్భాలలో, ఆత్మరక్షణ కోసం  లేక  ఇతరులను రక్షించటం కోసం  ఆయుధాన్ని ఉపయోగించటంలో తప్పు లేదని  పెద్దలు అంటారు కదా!

మరి , సుగ్రీవుని రక్షణ కోసం రాముడు ఆయుధాన్ని ప్రయోగిస్తే తప్పేమిటి ?  

వాలి ఎవరికీ ఏమీ హాని చేయని అమాయకుడేమీ కాదు కదా ! 
 ...........

వాలి  తన  ఎదురుగా  ఎవరు  నిలబడి  యుద్ధం  చేసినా ,  వారియొక్క సగం  బలం  తనకు  వచ్చేటట్లు  వరం  పొందిన  వ్యక్తి. 

ఇలాంటి ప్రత్యేకమైన  వరాలు  పొందిన  ప్రత్యేక  కేసులలో  ధర్మాలు  కూడా ప్రత్యేకంగానే ఉంటాయి  మరి.
 ...............

  రావణ సంహారం  విషయంలో  వానరుల  పాత్ర  ఉండాలి  కాబట్టి ,  దేవతలే  వానరులుగా  జన్మించారట.  
.............. 
ఇంకో విషయం ఏమిటంటే,

రాముడు , వాలిని చంపటం  ద్వారా .. తాను  రావణుని  సంహరించగలనని  ముందే  రావణుని  హెచ్చరించినట్లు  అయింది. 

 ( వాలి  రావణుని జయించిన  వాడు. తరువాత  వాలి, రావణులు  స్నేహితులయ్యారట.  )
...................  

హనుమంతుడు  సీతాన్వేషణ  చేయటం,  తరువాత  కధ  అందరికీ  తెలిసిందే.

సుగ్రీవుడు మొదలైన వారు , మానవులకు  వలె  నాగరికత  తెలిసిన  వానరులు  అనిపిస్తుంది.

  చీమలలోనే  రాణి  చీమ,  శ్రామిక  చీమలు ,  వాటి  కాలనీలు  ....  ఇలా ఎన్నో  రకాలు  ఉంటాయట. 

 మరి  ఉత్తమజాతికి  చెందిన  వానరులలో  రాజ్యాలు,  రాజులు,  రాణులు  ,  సైన్యం  ఉండటంలో  ఆశ్చర్యం  లేదు. 

 పురాణేతిహాసాల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.


Monday, July 13, 2015

రాముడు వనవాసంలో ఉండగా ఆయుధాలను ధరించి రాక్షసులును సంహరించటం..

 
మహర్షులు ఆయుధాలను ధరించటం గురించిన ఒక ఉదాహరణ..

ఒకానొకప్పుడు ధర్ముని కుమారులైన నరనారాయణులు ధనుర్బాణాలను ప్రక్కనే ఉంచుకుని తపస్సులు చేసిన విషయం గురించి..శ్రీ దేవీ భాగవతము.. ద్వారా తెలుస్తుంది. 
నరనారాయణులు విష్ణుమూర్తి అంశతో జన్మించిన మహర్షులు) 

...........
రాముడు వనవాస సమయంలో నార వస్త్రాలను ధరించి, ఆయుధాలు చేపట్టి రాక్షస సంహారం చేయటం ఏమిటనిపిస్తుంది కొందరికి.

( ఈ విషయం గురించి రామాయణంలోనే సీతారాముల మధ్య జరిగిన సంభాషణ ద్వారా సందేహనివృత్తి చేసారు.)
............

అయినాకూడా కొంతమంది ఏమంటారంటే,

 రాముడు అరణ్యాలకు వెళ్ళి జీవించాలని కైకేయి చెప్పింది, నారవస్త్రాలను కూడా ఇచ్చింది కాబట్టి..రాముడు తాపసిలా జీవించాలి కానీ, ఆయుధాలను ధరించి రాక్షసులను చంపటమేమిటి ? అంటారు.

అయితే, వనవాసానికి వెళ్ళే సమయంలో దశరధుడే  రామునికి ఆయుధాలను ఇవ్వటం జరిగింది కదా!

  తరువాత అగస్త్య మహర్షి కూడా రామునికి ఆయుధాలను ఇచ్చారు.
.................
రాముడు వనవాసం చేస్తున్నంత మాత్రాన , మునులను బాధలను పెడుతున్న రాక్షసులను ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకుంటే బాగుంటుందా ?

 తన భార్యను ఎత్తుకుపోయిన రావణాసురుని చంపకుండా  ఊరుకుంటే ఎలా ?
...................

ఎవరైనా సరే తమ ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఆయుధాలను ఉపయోగిస్తే తప్పేముంది ? 

మునులైనా సరే తమను ఎవరైనా చంపబోతే తమను తాము రక్షించుకోవటానికి ప్రయత్నిస్తారు కదా ! 

తమను, తోటివారిని  రక్షించుకోవటానికి, తమ తపస్సులను భగ్నం చేసే రాక్షసుల బారినుండి కాపాడుకోవటానికి కొందరు మహర్షులు తమ తపశ్శక్తిని ఉపయోగించారు కదా !

  అగస్త్యుడు తమ తపశ్శక్తితో చెడ్డగా ప్రవర్తించేవారిని శిక్షించారు కదా !

తమ తపశ్సక్తిని వృధా చేయటం ఇష్టం లేనప్పుడు కొందరు మునులు, రాక్షసుల బారి నుండి కాపాడమని ఇతరులను అడుగుతుంటారు.
.....................

 మునులు తపస్సులు చేసుకునే ప్రదేశాలను ఆక్రమించి, వారి తపస్సులను చెడగొట్టటానికి రాక్షసులను నియమించేవాడు రావణాసురుడు.

మునులు తపస్సులు చేయనీయకుండా రాక్షసులు వారిని బాధలు పెడుతుంటే ఆ మునులు రాముని సహాయం కోరారు. 

రాక్షసుల బారి నుండి కాపాడతానని రాముడు వారికి మాట ఇచ్చాడు.
...................

వనవాసంలో చాలా సంవత్సరాలు రాముడు ఆశ్రమాల వద్ద ఉండి తపస్వులను దర్శిస్తూ.. రాక్షసుల బారి నుండి మునులను రక్షిస్తూ ఉన్నాడు.

తరువాత శూర్పణఖ రావటం, అది రాముని మోహించటం , సీతను చంపబోవటం.. జరిగింది.

సీతాదేవిని చంపబోతే రాముడు చూస్తూ ఊరుకోడు కదా ! తరువాత శూర్పణఖ తరపు వాళ్లైన కొన్నివేలమంది రాక్షసులు దండెత్తి రాగా రాముడు వాళ్ళను సంహరించాడు. 
.............

సత్యం..  విషయంలో అనేక ధర్మసూక్ష్మాలను తెలియజేసారు పెద్దలు.
..........
 ఇతరుల ప్రాణాలకు నిష్కారణంగా హాని కలుగుతుంటే ..సత్యం పేరుతో... శక్తి ఉన్నవాళ్ళు  చూస్తూ ఊరుకుంటే , అలాంటి సత్యం.. సత్యం అనిపించుకోదు. 

 ఋషులు రాముడిని శరణు వేడి, రాక్షసుల బారినుండి రక్షించమని అడిగినప్పుడు, రాముడు ఆయుధాలను ధరించి , వారికి రక్షణను ఇవ్వటమే ధర్మం.
..............

  రాముడికి పట్టాభిషేకం నిర్ణయించిన ముహూర్తంలోనే భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని కైక కోరిందట.

అప్పుడు  భరతుడు అయోధ్యలో లేడు. భరతుడు అయోధ్యకు రావటానికే కొన్ని రోజులు పట్టినప్పుడు, అదే ముహూర్తంలో పట్టాభిషేకం చేయటం అంటే ఎలా  కుదురుతుంది ?  

దశరధుడు రాముడితో... నన్ను కారాగారంలో  వేసి  ఈ రాజ్యం పాలించు. ఆ విధంగానైనా నిన్ను రోజూ చూస్తాను. నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నప్పుడు..

.మరి అది కూడా తండ్రి మాటే కదా ! అని రాముడు రాజ్యాన్ని తీసుకోవచ్చు.  అయితే, రాముడు అలా చేయలేదు. 

 రాజ్యసుఖాలను  వదలి,  అరణ్యాలకు వెళ్ళి కష్టాలు అనుభవించిన  రాముడిని తిట్టే  వాళ్ళని ఏమనాలి ?


Friday, July 10, 2015

రామునికి రాజ్యంపై హక్కు..

 
అయోధ్య సింహాసనానికి  వారసుడు  కౌసల్య కుమారుడు రాముడు.

ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం రాజ్యం పెద్దవాడు పరిపాలించటం ధర్మం. 

జ్యేష్ట పుత్రునికి రాజ్యంపై హక్కు ..అనేది ధర్మమని పెద్దలు చెప్పినప్పుడు రామునికి రాజ్యంపై హక్కు ఉంటుంది. 

రాముడు తనకు ధర్మబద్ధమైన  హక్కు అయిన రాజ్యాన్ని తాను తీసుకుంటే తప్పేముంది ? 
.....................
అయితే రామాయణ విషవృక్షం అనే రచనలో రచయిత్రి ఏమంటారంటే, రామునికి రాజ్యంపై హక్కే లేదనీ, దశరధుడు కైకేయిని వివాహం చేసుకునే సమయంలో కైకేయి సంతానానికి రాజ్యం ఇస్తానని  దశరధుడు చెప్పటం జరిగింది కాబట్టి , రాముడికి హక్కు  లేదని వాదించటం జరిగింది.


రాముడు తన పాదుకలను భరతునికి ఇవ్వటం తప్పనీ , అడవుల నుంచి తిరిగి వచ్చిన తరువాత కూడా రామునికి రాజ్యాన్ని పాలించే హక్కు లేదనీ ఆమె వాదించింది.

 ఈ రచయిత్రి  అభిప్రాయం ఏమిటి ?

మగవాళ్లు భార్య ఉండగానే మరెందరినో వివాహం చేసుకుని వాళ్లందరికీ వాగ్ధానాలు చేస్తూ పోతుంటే ఆ వాగ్ధానాలన్నీ ధర్మబద్ధమే కానీ, అసలు భార్యకు కానీ, ఆమె సంతానానికీ కానీ హక్కు ఉండదు. అని రచయిత్రి చెప్పదలుచుకుంది గావున్ను. 
.........................

జ్యేష్ట పుత్రునికి రాజ్యంపై హక్కు అన్నది.. ఎప్పటి నుంచో ఉన్న ధర్మం.

  జ్యేష్ట  పుత్రునికి రాజ్యహక్కు ఇవ్వటం ధర్మమని పెద్దలు చెబుతుంటే, దశరధుడు కైకేయికి ఇచ్చిన మాట ధర్మం ఎలా అవుతుంది? 

 అందువల్ల,  దశరధుడు కైకేయికి మాట ఇవ్వకుండా , ఇంకో వివాహం చేసుకోకుండా  సంతానం కోసం యాగం చేస్తే బాగుండేదనిపిస్తోంది.

 అయితే ఎన్నో వివాహాలు చేసుకోవటం, తద్వారా కుటుంబంలో జరిగిన సంఘటనల వల్ల లోకం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. 

లోకానికి ఎన్నో విషయాలను నేర్పించటం ..అనే కారణం వల్ల కూడా విధి వారి జీవితాలను అలా నడిపించి , వారి జీవితచరిత్రలను లోకానికి అందించి ఉండవచ్చు.

ఓం.. రామాయణము అమృత వృక్షము..అద్భుత వృక్షము..

 
ఓం 
  వాల్మీకి మహర్షి  రామాయణమును  లోకానికి అందించారు..

  శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించటం, రావణాసురుణ్ణి సంహరించటం ఇదంతా ముందే ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని మనం పెద్దల ద్వారా తెలుసుకున్నాము.

 పురాణముల ద్వారా మనము జీవితములో ఎలా ప్రవర్తించాలి , ఎలా ప్రవర్తించకూడదు , ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ..వంటి విషయాలను  కూడా తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయము.


లోకంలో ఉండే రకరకముల వ్యక్తుల మనస్తత్వమూ, వారి ప్రవృత్తి, వాటి వల్ల జరిగే సంఘటనలు, పరిణామములు .. ఇలా ఎన్నో మనకు తెలియని గొప్ప విషయములు పెద్దలు మనకు పురాణేతిహాసముల ద్వారా తెలియచేశారు. 


రామాయణములో చూడండి..సీతారాములు ఎన్నో కష్టాలు అనుభవించినా కూడా ధర్మాన్ని వీడలేదు. ధర్మం కోసం వారు ఆ కష్టాలను తట్టుకున్నారు. అందుకే వారి సంతానము చక్కగా ఉన్నారు, రాజ్యమును కూడా పాలించారు. 

మరి రావణాసురుడు... కొంతకాలం సుఖములను అనుభవించినా కూడా ,  తరువాత తన అధర్మ ప్రవర్తన, అత్యాశ.. ఇత్యాది కారణాల వల్ల తాను నాశనం అవటమేకాక తనతోపాటు తన బంధువులు, సంతానము .. నాశనానికి కారకుడయ్యాడు. ధర్మమును అనుసరించిన విభీషణుడు రాజ్యాన్ని పాలించాడు.

 దీనివల్ల ఏం తెలుసుకోవచ్చంటే...మనము జీవితములో ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. అని.
 ..........

రామాయణము కావ్యము గురించి అనేక మంది తమ అభిప్రాయములను తెలియజేసారు. కొందరు రామాయణము తెలుసుకుని తమ జీవితాలను బాగుచేసుకున్నారు. కొందరు ఆ విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోకుండా  తిడుతూ జీవితాన్ని గడిపేవాళ్ళూ ఉన్నారు. ఎవరి అదృష్టం వాళ్లది. 

 రామాయణము గురించి నాకు తెలిసినంతలో కొన్ని అభిప్రాయములను ఇంతకుముందు కొన్ని టపాల ద్వారా వ్రాయటం జరిగింది. మరికొన్ని అభిప్రాయాలనూ వ్రాయాలనుకుంటున్నాను. అంతా దైవము దయ.
..............
దశరధుడు.. కౌసల్య, సుమిత్ర, కైకేయి  ..
 వీరి పుత్రులు శ్రీ రాముడు, లక్ష్మణుడు ,భరతుడు, శత్రుఘ్నుడు . 

జనకుడు మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు.  భార్య రత్నమాల. కుశధ్వజుడు జనకుని సోదరుడు.  

శ్రీ రామునికి సీతాదేవితో వివాహము జరుగుతుంది. లక్ష్మణుడికి ఊర్మిళతోను, భరతుడికి మాండవితోను, శత్రుఘ్నుడికి శృతకీర్తితోను వివాహం  జరుగుతుంది.

వశిష్టుడు , విశ్వామిత్రుడు..గురువులు. 

మారుతి (హనుమంతుడు) కూడా రామాయణములో  ముఖ్యమైన పాత్ర.

ఇంకా ఎన్నో పాత్రలున్నాయి. ప్రతి పాత్రకు దాని ప్రాముఖ్యత దానికున్నది.

అంతర్జాలంలో వాల్మీకి రామాయణము క్లుప్తంగా చదవవచ్చును. 
...................

రామాయణములో ఎన్నో ప్రక్షిప్తాలున్నాయని అంటారు.

కొందరు రామాయణాన్ని తమకు తోచినట్లు వ్రాసినవారు కూడా ఉన్నారు.

రామాయణ విషవృక్షంలో రచయిత్రి తనకు తోచినట్లు సంభాషణలను ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ టపా తరువాత భాగం అయిన ..  రామునికి  రాజ్యంపై హక్కు..అనే టపాను చదవవచ్చును.

Wednesday, July 8, 2015

గోదావరి పుష్కరాల శుభ సందర్భంగా కొన్ని విషయాలు..


నదులను మురికితో కలుషితం చేయకూడదు.

 పల్లెలు, పట్టణాల నుంచి , పరిశ్రమల నుంచి .. వచ్చే వ్యర్ధాలను నదులలోకి వదలకూడదు. 

నదీ స్నాన సమయంలో షాంపూలను, సబ్బులను వాడరాదు.

 పసుపు, కుంకుమ, పువ్వులు..  మొదలైనవి ప్లాస్టిక్ దొప్పలలో ఉంచి  నదులలో వదలకూడదు. 

పుష్కర స్నానం వల్ల  ఎంతో పుణ్యం లభిస్తుంది

 నదులను కలుషితం చేయకుండా ఉన్నప్పుడు ఎంతో పుణ్యం లభిస్తుంది.

ఇవన్నీ  చాలామందికి తెలిసిన విషయాలే. 

Monday, July 6, 2015

ఆహారనియమాలు పాటించే వారికి ఆహారాన్ని వండి అందించటం ....

 
ఈ మధ్య కాలంలో పిల్లలు ఉపాధికోసం వేరే ప్రాంతాలలో ఉంటుండగా,  పెద్దవాళ్లు మాత్రమే ఊరిలో ఉండటం ఎక్కువగా కనిపిస్తోంది.

 ఒకే దగ్గర ఉన్నాకూడా, తమ ఆరోగ్యానికి సరిపడేవిధంగా వండిపెట్టాలని  పిల్లలను అడిగి ఆహారం వండించుకోవటానికి ఇబ్బందిపడే పెద్దవాళ్లూ ఉంటారు.

ఒకే దగ్గర ఉన్నాకూడా, చంటి పిల్లలకు జావ ఆహారం, చిన్న పిల్లలకేమో వేపుళ్లు, పెద్ద వాళ్ళకేమో నూనె లేకుండా కూరలు .. ఇలా  ఇంట్లో ఒక్కొక్కరికి  ఒక్కోరకం చేయాలన్నా..అన్నిసార్లూ కుదరక పోవచ్చు.

 ఎదిగే వయసులో ఉన్న చిన్న పిల్లలకి ఎంతో అవసరమైన సమాతులాహారాన్ని ఇవ్వకుండా..   న్యూడిల్స్, బ్రెడ్ వంటివి  ఎక్కువగా  ఇచ్చేస్తున్న పెద్దవాళ్లు ఈ రోజుల్లో  చాలామందే ఉన్నారు.
..............................

 ఈ రోజుల్లో చాలామందికి  45 సంవత్సరాల వయస్సు కంటే  ముందే  బీపీ, సుగర్..వంటి వ్యాధులు వస్తున్నాయి.

ఇక..  65, 75 ..వయస్సు వాళ్లయితే ఎక్కువ పనులు చేసుకోలేరు.

 పెద్దవయస్సు వచ్చిన తరువాత కొందరికి జీవిత భాగస్వామి కూడా ఉండకపోవచ్చు. భార్య లేని పురుషుడు బజారు కెళ్ళి సరుకులు తెచ్చుకున్నా వంట చేసుకోలేక పోవచ్చు. భర్త లేని స్త్రీ బయటకెళ్లి సరుకులు తెచ్చుకోలేకపోవచ్చు. 

ఇలాంటివారికోసం ఆహారాన్ని వండి ఇళ్ళకు పంపించే విధంగా ఏర్పాటు ఉంటే బాగుంటుంది.    
.................................

పెద్దవయస్సు వచ్చిన వారిలో కొందరికి గుండె జబ్బు...  వంటి  వ్యాధులు   ఉండే అవకాశాలున్నాయి.

 పెద్ద  వయస్సులో అనారోగ్యం వల్ల కొన్నిసార్లు వంట చేసుకోవటానికి చేతకాకపోవచ్చు. 

అలాగని హోటల్ నుంచి తెప్పించుకోవటమో  లేక కర్రీ పాయింట్ నుంచి తెప్పించుకోవటమో చేస్తే ఆ పదార్ధాలలో వేసే అధిక నూనె, కారం, ఉప్పు వల్ల అనారోగ్యం మరింత పెరిగే ప్రమాదముంది. 

వంట మనిషిని పెట్టుకోవాలంటే అందరివల్లా అయ్యే పనికాదు. 

ఈ రోజుల్లో సిటీలో వంటమనిషిని ఏర్పాటుచేసుకోవాలంటే నెలకు 10 వేలు అడుగుతున్నారని మాకు బాగా దగ్గరవాళ్ళు చెప్పారు. అదీ ఒక పూటే వస్తారట. వంట చేసిన ఆమె  కూడా అక్కడే భోజనం చేస్తుందట . 
..........................

ఇవన్నీ చూసిన తరువాత నాకు ఏమనిపించిందంటే,  పెద్దవాళ్లకు వంట చేసి  ఇళ్ళకు  పంపించే విధంగా ఎవరైనా చేస్తే బాగుంటుందనిపించింది.

 బీపీ ఉన్నవాళ్ళకు ఉప్పు లేకుండా, సుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు పంచదార లేకుండా, కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లకు అందుకు తగిన విధంగా వండించి ఇంటికి పంపే విధంగా  ఉంటే బాగుంటుంది. 

పెద్ద హాస్పిటల్స్లో  పేషెంటుకు ఆహారాన్ని హాస్పిటల్ వాళ్ళే ఇస్తారు. ఏ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఆహారాన్ని తయారుచేయాలో ఇలాంటి వాళ్లకు చక్కగా తెలుస్తుంది.
..........................

అయితే రోజూ బయట  నుంచి ఆహారం తెచ్చుకోవటం పెద్దవాళ్లకు ఇష్టం ఉండకపోవచ్చు.

 ఆరోగ్యం సరిగ్గా లేక నీరసంగా, నిస్సత్తువుగా ఉన్నప్పుడు మాత్రం  ఎవరైనా ఇంత వండి పెడితే బాగుండు.అనుకుంటారు పెద్దవాళ్లు.

ఆహారం వండలేని పరిస్థితి ఉన్న రోజున హోటల్  కు ఫోన్ చేసి ఈ రోజు వంట చేసి పంపండి...  అని చెపితే ఆ రోజుకు భోజనం పంపించే విధంగా ఉంటే హోటల్ వాళ్లకు కూడా ఆహారం వృధా కాకుండా ఎంతమందికి అవసరమో అంతవరకే వండుతారు.

 ఈ రోజు మేమే వండుకుంటాం అనుకుంటే.. హోటల్ వాళ్లకు ఆ మాట కొంచెం ముందే  చెపితే సరిపోతుంది.
.........................

అయితే, ఆహారపదార్ధాలకు బోలెడు రేట్లు పెడితే తీసుకునేవారు ఉండరు. ఎక్కువలాభం వేసుకోకుండా ధర్మబద్ధంగా లాభం వేసుకుని చేస్తే ఎక్కువమంది వస్తారు. 

ఇది వ్యాపారం అనీ అనుకోవచ్చు. సమాజసేవ అనికూడా అనుకోవచ్చు.

ఇలాంటి వ్యాపారాన్ని  వ్యాపారదృష్టి మాత్రమే కాకుండా....  సమాజసేవాదృష్టి కూడా ఉన్నవారే సరిగ్గా చేయగలరు.
............................

అయితే, ఎలాంటి వారికి ఎలాంటి పద్ధతిలో వండాలో తెలిసిన వాళ్ళ సహాయంతో వంట చేయటం జరగాలి. 

ఉదా..బీపీ  ఉన్నవారికి ఉప్పు లేకుండా, కిడ్నీ వ్యాధి ఉన్నవారికి వారికి తగ్గట్లుగా వంట చేసి పంపాలి. 

 ధర్మబద్ధమైన లాభంతో, శుచిగా ఆహారాన్ని అందిస్తే  పెద్దవాళ్ళకు సహాయం చేసిన వాళ్లవుతారు. పుణ్యమూ, పురుషార్ధమూ కూడా దక్కుతాయి.