koodali

Monday, April 27, 2015

ఓం......

 
 ఓం.. శ్రీ రామ శ్రీరామ

శ్రీ ఆంజనేయ దండకము


శ్లో.. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం 


తరుణార్కప్రభాం శాంతం రామదూతం నమామ్యహం


శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజంబటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నూహించి నీమూర్తిగావించి నీ సుందరం బెంచి నీదాసదాసాను దాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీకటాక్షంబునన్ జూచితే  వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ నన్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకు న్మంత్రివై స్వామికార్యార్ధమై యేగి శ్రీరామ సౌమిత్రిలం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి యవ్వాలినిన్ జంపి కాకుత్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్ధమై   లంకకేతించియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ యబ్బూమిజం జూచి యానంద ముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషమున్ జేసి సుగ్రీవుడున్ అంగదున్ జాంబవంతున్ న్న లున్నీలునిం గూడి యా సేతువున్ దాటి వానరుల్ మూకలై పెన్మూకలై యా దైత్యులను ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వైచి యాలక్ష్మణున్ మూర్చనొందింపగానప్పుడే నీవు సంజీవినిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా  కుంభకర్ణాదులు న్వీరులంబోర   శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమైయుండ నవ్వేళనున్ విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించె శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీకీర్తనల్ చేసినన్ బాపముల్ బాయవే భయముల్ దీరవే భాగ్యముల్ గల్గవే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ గల్గునో వానరాకార యో భక్తమందార యో పుణ్యసంచార యో ధీర యో వీర నీవే సమస్తంబుగానొప్పి యా తారక బ్రహ్మమంత్రంబు పఠియించి  వజ్రదేహంబునున్  దాల్చి వర్తించు  నీదివ్యనామంబు నా జిహ్వనుందాల్తు త్రైలోక్యసంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునన్ బొల్చు రౌద్రానులేభా వీర హనుమంత హుంకారశబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబులన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టిఘాతంబులన్ బాహు దండంబులన్ రోమ ఖడ్గంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవే నీవు బ్రహ్మ ప్రభాబాసితంబైన నీ దివ్య తేజంబునున్ జూపి రారోరి నాముద్దు నరసింహ యంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి శ్రీయాంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ సదాపాపహారీ నమస్తే నమో వాయుపుత్రా నమస్తేనమః . 

..................

శ్రీ గురు చరణ సరోజ రజ నిజమున ముకర సుధారి

వరణౌ రఘువర విమల యశజో దాయక ఫలచారీ
బుద్ధిహీన జానికై సుమిరౌ పవన కుమార్,
బల బుద్ధి విద్యాదేహు మోహి, హరహు కలేశ వికార్.

శ్లో|| బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాహ్

అజాడ్యం వాక్పటుత్వం చ హనుమంత్ స్మరణాద్భవేత్  ||

ప్రార్ధన


ఓం
రామ

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం

దనుజ వనకృశానం జ్ఞానినా మగ్రగణ్యమ్ 
సకల గుణ నిదానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి

గోష్పదీకృత వారాశిం

మశకీకృత రాక్షసమ్ 
రామాయణ మహామాలా
రత్నం వందేనిలాత్మజమ్ 
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్ 
తత్ర తత్ర కృతమస్తకాంజలిం
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్ 
మారుతిం నమత రాక్షసాంతకమ్ 

.............

హనుమాన్ చాలీసా..

1.జయ హనుమాన జ్ఞాన గుణసాగర |

జయ కపీశ తిహులోక ఉజాగర ||

2.రామదూత అతులిత బలధామా |
 అంజని పుత్ర పవనసుత నామా ||

3.మహావీర విక్రమ బజరంగీ |

కుమతి నివార సుమతీ కే సంగీ ||

4.కంచన వరన విరాజి సువేసా |

కానన కుండల కుంచిత కేశా ||

5.హాధ వజ్ర ఔర్ ధ్వజ విరాజై |

కాంధే మూంజ జనేవూసాజై ||

6.శంకర సువర కేసరి నందన |

తేజ ప్రతాప మహాజగ వందన ||

7.విద్యావాస గుణీ అతిచాతుర |

రామకాజ కరివేకో ఆతుర ||

8.ప్రభు చరిత్ర సునివేకో రసియా |

రామలఖన సీతా మన బసియా ||

9.సూక్ష్మ రూప దహి సియహి దిఖావా |

వికట రూప ధరి లంక జరావా ||

10.భీమ రూప ధరి అసుర సంహారా |

రామ చంద్ర కే కాజ  స వారే  ||

11.లాయ సజీవన లఖిన జియాయే |  

శ్రీరఘువీర హరషి ఉర లాయే ||

12.రఘుపతి కీన్హీ  బహుత బడాయీ |

తుమ మమప్రియ భరతహి సమభాయి || 

13.సహస వదన తుమ్హరో యశగావై |

అస కహీ శ్రీపతి కంఠ లగావై ||

14.సనకాదిక బ్రహ్మాది మునీశా |

నారద శారద సహిత అహీశా ||

15.యమ కుబేర దిగపాల జహాతే |  

కవికోవిద కహినకై కహాఁతే ||

16.తుమ ఉపకార సుగ్రీవ హిఁకిన్హా | 

రామ మిలాయ రాజపద దీన్హా  ||

17.తుమ్హరో మంత్ర విభీషణ మానా |

లంకేశ్వర భయే సబ జగ జానా ||

18.యుగ సహస్ర యోజన పర భానూ | 

లీత్యో తాహి మధుర ఫల జానూ ||

19.ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ | 

జలధి లాంఘి గయే ఆచరజ నాహీ ||

20.దుర్గమ కాజ జగత కే జేతే |

సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||

21.రామ దుఅరే తుమ రఖవారే |

హోత న ఆజ్ఞా బిను పైసారే ||

22.సబ సుఖ సులహై తుమ్హారీ శరనా |

తుమ రక్షక కాహుకో డరనా ||

23.అపన తేజ సమ్హారో ఆపై

తీనోలోక హాంకతే కాంపై ||

24.భూత పిశాచ నికట నహి ఆపై |

మహావీర జబనామ సునావై ||

25.నాసై రోగ హరై సబ పీరా |

జపత నిరంతర హనుమత వీరా ||

26.సంకట తే హనుమాన చుడావై |

మన క్రమ వచన ధ్యాన జో లావై || 

27.సబ పర రామ తపస్వీ రాజా |

తినకే కాజ సకల తుమ సాజా ||

28.ఔర మనోరధ జో కోయి లావై |

సోయి అమిత జీవన ఫల పావై ||

29.చారో యుగ పరతావ తుమ్హారా |

హై పరసిద్ధ జగత ఉజియారా ||

30.సాధు సంతకే తమ రఖవారే |

అసుర నికందన రామ దులారే ||

31.అష్ట సిద్ధి నౌ నిధికే దాతా |

అస వర దీన జానకీ మాతా ||

32.రామరసాయన తుమ్హరే పాసా |

సదా రహో రఘుపతికే దాసా ||

33.తుమ్హరే భజన రామకో పావై |

జన్మ జన్మకే  దుఃఖ  బిసరావై || 

34.అంతకాల రఘుపతిపుర జాయీ |

జహా జన్మ హరిభక్త కహాయీ ||

35.ఔర దేవతా చింతన ధరయీ |

హనుమత సేయి సర్వసుఖకరయీ ||

36.సంకట హటై మిటై సబ పీరా | 

జో సుమిరై హనుమత బలవీరా ||

37. జై జై జై హనుమాన్ గోసాయీ |

కృపాకరో గురుదేవకీ నాయీ ||

38.జో శతవార పాఠకర్ కోయీ |

చూటహిబంది మహాసుఖహోయీ ||

39.జో యహ పఢై, హనుమాన్ చాలీసా |


హోయసిద్ధి సాఖీ గౌరీసా ||


40.తులసీదాస సదా హరిచేరా |

కీజై నాధ హృదయ మహడేరా ||

దోహా.. ..పవన తనయ సంకట హరణ

మంగళ మూరత్ రూప్
రామ లఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్ 

శ్రీ గోస్వామి తులసీ దాసు 

.........................

 'న' అనే అక్షరం వచ్చే దగ్గర 'స' అన్నట్లు వస్తోంది. ఉదా..బాహు దండంబులన్ ..వద్ద గమనించవచ్చు .  

ప్రచురించిన విషయాలలో అచ్చుతప్పులు వంటివి ఉన్నచో ..  దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను .
...................
  విషయములను అందించిన అందరికి కృతజ్ఞతలు.  ఇందులో ముద్రించిన కొన్ని సింబల్స్ నెట్లో సేకరించి వేసినవి. వారికి కృతజ్ఞతలు.


Saturday, April 25, 2015

వేసవి వానలు ...


 ఈ మధ్యన పడిన వానకు సేదతీరిన పక్షులు చేస్తున్న కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. 

........................... 

మండే వేసవికాలంలో నీరు త్రాగకుండా ఎక్కువసేపు  తట్టుకోలేము. మరి దాహం అని చెప్పుకోవటం   చేతకాని మూగజీవులైన మొక్కలు, పశుపక్ష్యాదుల సంగతి ఏమిటి ? 


అందుకే వేసవిలో  కొద్దిగానైనా వాన పడాలి.   ఆ నీటితో మొక్కలు, పశుపక్ష్యాదులు సేదతీరుతాయి. పాపం వాటికీ దాహం వేస్తుంది కదా ! ఎంతకీ మనుషుల ఆకలిదప్పులే ముఖ్యం అనుకోకూడదు.


భూమిపై నివసించటానికి  మనుషులకే కాదు.. పశుపక్ష్యాదులకూ హక్కు ఉంది . 

...............

వేసవికాలంలో కొద్దిపాటి వర్షాలు పడటం  సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. 


పాతకాలంలో, ఎండాకాలంలో ఎండిన  చెరువులు, కుంటల వద్ద  కొద్దిగా అయినా నీరుండేది.   ఈ రోజుల్లో అయితే  మనుషుల అవసరాలకు ఎక్కడి భూమీ  చాలటం లేదు. చెరువులను, కుంటలను కూడా కబ్జాచేసేసి  ఏదో ఒక నిర్మాణాలు నిర్మించేస్తున్నారు.



 మట్టినేలలో వర్షపు నీరు ఇంకకుండా  ఎక్కువ భాగం నేలను   సిమెంటుతో కప్పేస్తున్నారు. పశుపక్ష్యాదులకు త్రాగటానికి నీరన్నది దొరకకుండా చేస్తున్నారు.

..................

ముఖ్యంగా సిటీలలో నీరు అన్నది బయట కనబడకుండా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంటుంది కదా ! 


 మేము చెన్నైలో ఉన్నప్పుడు  డాబా పైన .. ఒక  
ప్లాస్టిక్ బౌల్  తో నీళ్లు పెడితే  కాకులు,  ఉడుతలు.. వచ్చి నీరు  త్రాగేవి.


(  ప్లాస్టిక్ బౌల్ బదులు  మట్టిముంత  కూడా ..ఉపయోగించ వచ్చు. )

 
 బౌల్ లో  రెండురోజుల కొకసారి  కొత్తగా నీరు పోస్తే సరిపోయేది. అప్పుడప్పుడు  బౌల్  శుభ్రం  చేస్తే  బాగుంటుంది. 


(ఎండకు నీళ్లు సలసలా వేడెక్క కుండా ... నీటి పాత్ర నీడలో పెట్టాలి.)

......................... 

 ఇళ్ల ముందు  ఎత్తు  తక్కువ ఉన్న  వెడల్పాటి  నీటితొట్టెలను నెలకొల్పి ,  వాటిలో నీటిని నింపితే పశుపక్ష్యాదులు త్రాగటానికి బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది .  


 ( అయితే,  పసిపిల్లలు  నీటి  తొట్టెలలో పడే  ప్రమాదం నుంచి  జాగ్రత్తగా ఉండాలంటే... 
నీటితొట్టె  ఎత్తు తక్కువ  ఉండాలి. )

..............

 ఈ రోజుల్లో వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పుల వల్ల   వేసవిలో  అల్పపీడనం  ఏర్పడి , తీవ్రమైన గాలివానలు  వస్తున్నాయి.   ఈ   గాలివానల వల్ల పంటలు దెబ్బతింటున్నాయంటున్నారు.


 (పంటలు  నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలి.)
........................... 
వాతావరణంలో సమతుల్యత ఉంటే , వేసవిలో అల్పపీడనం.. తీవ్రమైన గాలివానలు రాకుండా.. కొద్దిపాటి వాన మాత్రం పడి,  ఎండల నుంచి జీవజాలం కొద్దిగా తేరుకుంటుంది .  తీవ్రమైన  గాలిలేని..  కొద్దిపాటి వాన వల్ల పంటనష్టం చాలా తక్కువగా ఉంటుంది. 


వాతావరణంలో పెనుమార్పులు రాకుండా  ఉండాలంటే...  పర్యావరణాన్ని పాడుచేసుకోకూడదు. 



Wednesday, April 22, 2015

ప్రకృతి రక్షణ అంటే మనిషి మనుగడకు రక్షణ. ..

 
ఈ రోజు ధరిత్రీ దినోత్సమట . పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే ధరిత్రి (భూమి ) బాగుంటుంది.

మొక్కలను బాగా నాటి చక్కగా పెంచాలి. ఇందువల్ల అధిక ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.


అడవులను రక్షించుకోవాలి. అడవులు దట్టంగా ఉంటే వర్షాలు చక్కగా కురుస్తాయి. నీటి కరువు రాకుండా ఉంటుంది. 


అడవులు అంతరించకుండా కాపాడుకోవటానికి హెలికాప్టర్లను ఉపయోగించి వర్షాకాలం ప్రారంభంలో  కొండలపై విత్తనాలను చల్లవచ్చు. 

.............

శేషాచలం అడవుల్లో నిప్పు వ్యాపించటం గురించిన వార్తలు వచ్చినప్పుడు , కేవలం చెట్లకొమ్మలను చేత్తో పట్టుకుని నిప్పును ఆర్పటానికి  ప్రయత్నించే  సిబ్బంది చిత్రాలను మీడియా ద్వారా చూసి ఉంటాము. 


 అగ్ని ప్రమాదాలను అదుపు చేయటానికి అవసరమైన సామాగ్రిని  సిబ్బందికి  అందించ వచ్చు . 


  శేషాచలం కొండలపైన  ఇంతకుముందు  ఒకసారి అగ్నిప్రమాదం జరిగినప్పుడు , హెలికాప్టర్ల సాయంతో నీటిని జల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు గుర్తుంది.


 అగ్నిప్రమాదం చిన్నదిగా ఉన్నప్పుడు ..   ఫయర్ ట్రక్స్ సాయం కూడా తీసుకోవచ్చు. (ఫైర్ ట్రక్స్..కొండదారులలో ప్రయాణించటానికి వీలుగా డిజైన్ చేసుకోవచ్చు.)


మరికొన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు .. 

3 Ways to Fight a Forest Fire - wikiHow

.........

మడ అడవులను కూడా రక్షించుకోవాలి. వీటివల్ల సముద్ర తీరం కోతకు గురికాకుండా ఉంటుందంటారు.

............
మొక్కలు బాగా పెంచితే ఎన్నో లాభాలున్నాయి. వృక్షాల  వల్ల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. 
................
 వృక్షాల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని అంటారు. అయితే, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా ! 

వాతావరణ కాలుష్యం మరీ ఎక్కువైతే వృక్షాలు కూడా తట్టుకోలేవు.

మనుషులు తమ  అంతులేని కోరికలను తగ్గించుకోవటమే ఎన్నో సమస్యలకు పరిష్కారం.




Monday, April 20, 2015

రేపు అక్షయ తృతీయ...

 
అక్షయ తృతీయ రోజున సింహాచలంలో చందనోత్సవాన్ని  చేస్తారు. 
.....................

అక్షయతృతీయ నాడు దానం చేస్తే మంచిదంటారు .

 అక్షయ తృతీయ సందర్భంగా.. మంచినీరు, గొడుగు, విసనకర్ర ...వంటివి   ఇతరులకు  దానం చేస్తే మంచిదని పెద్దలు  తెలియజేసారు. 

 దానం చేయటం వల్ల దానం చేసినవారికి మంచి  జరుగుతుందని,   ఆహారం,   గృహం …వంటివి   కొరత లేకుండా లభిస్తాయని అంటారు. 
................

 అయితే  ఈ రోజుల్లో, దానం చేసే ఆచారం  తగ్గిపోయి, ఎవరికి వారు  బంగారం కొనుక్కోవటం అనే ఆచారం మాత్రమే బాగా ప్రచారంలోకి వచ్చింది. 
..........

 అక్షయతృతీయ  పండుగ  వేసవిలో  వస్తుంది.  అప్పుడు  మంచినీరు, గొడుగు, విసనకర్ర    వంటివి  దానం  చేయటం  వల్ల  ఎందరికో ఉపయోగం  కలుగుతుంది. 


పూర్వీకులు  సమాజంలో  అందరికీ  ఉపయోగపడేవిధంగా  ఎన్నో  చక్కటి  ఆచారాలను ఏర్పాటుచేసారు. 


అయితే  కాలక్రమేణా  కొన్ని  ఆచారాలు  మార్పులుచేర్పులను  సంతరించుకుని  పూర్వీకుల  అసలు  ఉద్దేశ్యాన్ని  మరుగునపరచే  విధంగా  తయారవుతున్నాయి.
..............

ఈ రోజున బంగారం  కొనుక్కోవటం  మంచిదని  కూడా  పెద్దలు తెలియజేశారు. దానితో పాటూ దానం చేస్తే మంచిదని  కూడా చెప్పారు.

అయితే ఇప్పుడు  ఇతరులకు  దానం  చేయవలసిన  విషయాలను  వదిలేసి , అక్షయతృతీయ  అంటే  బంగారం  కొనుక్కోవటమే ..అన్నట్లుగా  జరిగిపోతోంది.
 ............. 

 అంతా బాగుండాలి. అంతా దైవం దయ.


Friday, April 17, 2015

వ్యక్తులు చేయగలుగుతున్నప్పుడు .. . వ్యవస్థ ద్వారా చేయగలగటం సాధ్యమే కదా !

  

 

ఒకప్పుడు  ఈ  దేశం   ఎంతో  సిరిసంపదలతో  తులతూగేదని   అప్పటి   విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాల ద్వారా తెలియజేసారు.  


మరి ఇప్పుడు ..ఈ దేశం ఎందుకిలా తయారయ్యిందో ?

దేశంలో  ఎందరో  మేధావులు  ఉన్నారు.  ఎందరో  కష్టించి  పనిచేసేవాళ్ళు  ఉన్నారు. అపారమైన  ప్రకృతి  సంపదలున్నాయి.  జలజలపారే  జీవనదులెన్నో  ఉన్నాయి.   చక్కటి  సూర్యరశ్మి  ఉంది.   చక్కగా  జీవించటానికి  కావలసినవెన్నో  ఉన్నాయి.


 మరి  దేశంలో  ఇంత  పేదరికం,  ఇంత  అశుభ్రత  ఎందుకు  పెరిగిపోయింది ? మనం  మన దేశాన్ని    బాగుచేసుకోలేమా?  అందరూ  తలచుకుంటే   దేశంలో   పేదరికం,  అవినీతి,  అశుభ్రత  పోకుండా  ఉండదు  కదా!


   మన  పూర్వీకులు  చక్కగా  పొదుపుగా  జీవించేవారు.  ఎక్కువ  ఆడంబరాలకు  పోవద్దని  ,  పరిసరాలను  శుభ్రంగా  ఉంచుకోవాలని ,  మరెన్నో  చక్కటి  విషయాలను   గ్రంధాల  ద్వారా  తెలియజేశారు.


శుచిశుభ్రత  ఉన్న  ఇంట్లో ,  పరిసరాలలో   లక్ష్మీదేవి  ఉంటుందని  తెలియజేశారు.  జీవితంలో  ఎలా  ప్రవర్తించాలో,  ఎలా  ప్రవర్తించకూడదో ,   ఎలా  ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  వస్తాయో  పురాణేతిహాసాల  ద్వారా  తెలియజేశారు.


 మనిషి  పుట్టుక  నుంచి  మరణానంతరం  కూడా  ఏమవుతుందో    వివరించే  విజ్ఞానాన్ని    అందించారు. చావుపుట్టుకల  మధ్య  జీవించటానికి  అవసరమైన  విజ్ఞానాన్ని  తెలియజేశారు.


  నైతికవిలువలను  పాటించిన  దగ్గరే  దైవానుగ్రహం  లభిస్తుంది.   నైతికవిలువలను  పాటించకుండా  జీవిస్తున్న  జాతి   గతి   అధోగతే.
..................................... 


 కొందరు  వ్యక్తులు  తాము   జన్మించిన  ఊళ్ళను   ఆదర్శంగా  తీర్చిదిద్దారని , పేదరికం,  నిరక్షరాస్యత ,  దురలవాట్లు.  వంటివి  లేకుండా  చేశారని ,  తమ  గ్రామాలను  ఎంతో  అభివృద్ధి  చేసారని  పత్రికల్లో  రాస్తుంటారు.


ఇలాంటి   గొప్ప  వ్యక్తులు  తమ  గ్రామాలను  ఏ  విధంగా   అభివృద్ధి   చేసారో  చూసి  తెలుసుకుని  ఆ  విధంగా  అన్ని  గ్రామాలను,  నగరాలను  అభివృద్ధి  చేయవచ్చు.


చేతిలో  అధికారం,  ఆర్ధికవసతులు  సరిగ్గా  లేకుండానే   కొందరు  వ్యక్తులు  గ్రామాలను  అభివృద్ధి చేస్తున్నారంటే ,   ప్రభుత్వం,  అధికారులు,  ప్రజలు  గట్టిగా  సంకల్పించుకుంటే  ఈ  దేశం  తిరిగి  పునర్వైభవాన్ని  పొందగలుగుతుంది  ....అని  ఆశించటంలో  ఎటువంటి  సందేహమూ  లేదు.


Wednesday, April 15, 2015

ఆధునిక సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వాన్ యూ గురించి మరియు ..

 
ఆధునిక  సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వాన్ యూ.. గురించి  ఈనాడులో  కొన్ని వివరాలు చదివిన తరువాత ..
 సింగపూర్ను ఆయన ఎన్నో కోణాల నుంచి  అభివృద్ధి చేయటం జరిగిందని తెలుస్తోంది.  
........
కొన్ని విషయాల గురించి చెప్పుకుందాము.

సింగపూర్ లో సహజ వనరులు లేకపోయినా  అంతర్జాతీయ వ్యాపారంలో  దూసుకువెళ్తోందట.


( మనదేశం కూడా ఆర్ధికంగా అంతర్జాతీయంగా వెలుగులు విరజిమ్మితే  బాగుండు .)


సింగపూర్ ప్రజలకు ఉన్నతమైన అలవాట్లు ఉండాలని ఆయన భావించారట. ప్రజల వ్యసనాలను వదిలించటానికి  ఎన్నో ప్రయత్నాలు  చేసారట .


( మనదేశంలో  ప్రభుత్వాలు మద్యం మీద వచ్చే ఆదాయం కోసం ఆధారపడకుండా  ఉంటే బాగుండు  .)


వెనుకాముందూ చూడకుండా వీధుల్లో తుపుక్కున ఊసే వారితో జరిమానా కట్టించారట.


( మన దేశంలో కూడా ఇలాంటివి అమలులోకొస్తే  బాగుండు  .) 


ఇద్దరు పిల్లల్ని మించి కనొద్దని హుకుం జారీ చేసాడట. అయినా వినకుండా గంపెడు పిల్లల్ని కనేవారి మీద పన్నులు వేశారట.


( ఏమిటో..ఇలాంటివి మనదేశంలో అసలు ఊహించగలమా ? ఇక్కడ కూడా  ఇలాంటివి అమలులోకొస్తే  బాగుండు .)


కాలుష్యనివారణకూ అధిక ప్రాధాన్యతను ఇచ్చారట... కారు కొనాలంటే ఆ ధరకు ఒకటిన్నర రెట్లు మొత్తాన్ని పన్నుగా చెల్లించాలనే షరతు విధించారట. ఇంకా కొన్ని షరతులూ ఉన్నాయట.


ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుంటే ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకోవచ్చట. అందుకే సింగపూర్ లో ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే కారు ఉంటుందట. 


( మన దేశంలో  కూడా ఇలా జరిగితే  బాగుండు .)

..........
ఆయన అధికారంలోకి రాకముందు, ప్రజలు ..  మురుగునీటినీ, పారిశ్రామిక వ్యర్ధాల్నీ నదుల్లోకి మళ్లించేవారట. 

మన జీవితాల్ని మనమే సర్వనాశనం చేసుకుంటామా ? ఇదేం పద్ధతి ? అని ఆగ్రహంగా ప్రశ్నించారట  లీ క్వాన్ యూ.  


ప్రజలు ఆలోచనలో పడి జలవనరులను సంరక్షించుకోవటానికి  స్వచ్చందంగా ముందుకొచ్చారట..


 ( మనదేశంలో  కూడా ఇలాంటి అద్భుతాలు జరిగితే బాగుండు .)

...............

మాతృభాషకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారట.


( మాతృభాష అంటే మృత భాషగా భావించే  మన దేశంలోని జనం తమ అభిప్రాయాలను మార్చుకుని మాతృభాషను గౌరవిస్తే బాగుండు .)


సింగపూర్ లో అవినీతి చాలా తక్కువట. 


( మన దేశంలో కూడా  అవినీతిపరుల పని పట్టే  పటిష్టమైన వ్యవస్థ  వస్తే బాగుండు .)

.............

 సింగపూర్లో  ఖనిజవనరులు అసలేమీ లేవట. నీటివసతి కూడా అంతంత మాత్రమేనట.  లీ క్వాన్ యూ అధికారాన్ని చేపట్టే నాటికి సింగపూర్    సంక్షుభిత దేశమట.


అయితే, నాయకుని ఆలోచనలకు ప్రజలూ స్పందించి తమ సహకారాన్ని అందించారట. 


 అయినా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సింగపూర్ను అభివృద్ధి చేసిన మహామనీషి  లీ క్వాన్ యూ  అంటారు. ఇలాంటి  నాయకులను ప్రజలు కలకాలం గుర్తుంచుకోవటంలో ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు.


 అయితే, నాయకునికి సహకరించిన అధికారులూ, ప్రజలూ కూడా ఎంతో అభినందనీయులే. 


నాయకులు, అధికారులూ, ప్రజలూ కలిసి పనిచేస్తే చక్కటి స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చని  అనుభవపూర్వకంగా తెలుస్తోంది.



Monday, April 13, 2015

ఖనిజవనరులు అత్యంత విలువైనవి...


ప్రకృతిలో ఖనిజాలు వంటి సహజవనరులు ఏర్పాడాలంటే ఎన్నో వేల సంవత్సరాలకు పైనే పడుతుంది. ఇలాంటి సహజవనరులు  అమూల్యమైనవి. వీటిని పొదుపుగా వాడుకోవాలి.

 మన పాత తరాలవాళ్ళు వాటిని విచ్చలవిడిగా వాడేసి ఉన్నట్లయితే,  ఇప్పుడు మన పని అధ్వాన్నంగా ఉండేది. వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ఇప్పుడు మనకు ఎంతో ఖనిజ సంపద ఉంది.


 అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ?


 టెక్నాలజీ, ఉపాధి కోసం ...అంటూ సహజవనరులను విచ్చలవిడిగా తవ్వేసి ఖాళీ చేసేస్తున్నాము.పరిస్థితి ఇలాగే ఉంటే ముందు తరాలవారి చేతికి  చిప్ప కూడా మిగలకపోవచ్చు. 


 దూరదృష్టి ఉన్న కొన్ని పాశ్చాత్య దేశాల వాళ్ళు రాబోయే పరిస్థితిని అంచనావేసి తమ దేశాలలోని  ఖనిజవనరుల త్రవ్వకాలను గణనీయంగా తగ్గించి ఖనిజాలను దాచుకుంటున్నారట. 


వారి అవసరాల కొరకు ఇతరదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారట.మనకు  కూడా  దూరదృష్టి ఎంతో అవసరం. 


ఖనిజాలను  ఎంతవరకూ అవసరమో అంతవరకే వాడుకోవాలి.  మన కోరికలను  కొంతమేరకు తగ్గించుకోవాలి. 



ఉపాధి కోసం అంటూ విచ్చలవిడిగా  ఖనిజవనరులను  త్రవ్వేస్తే రాబోయే కాలంలో విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. 


దురదృష్టం ఏమిటంటే,  ఈ రోజుల్లో ఇలాంటి జాగ్రత్తలను పట్టించుకునే వారు తగ్గిపోయారు.


  ఇప్పటి అవసరాలు తీరటమే ముఖ్యం. రాబోయే తరాల వారి గోల మనకేల ? అనుకునే వాళ్లు ఎక్కువయ్యారు. 


ఖనిజవనరులు అప్పుడే అయిపోతాయా ఏమిటి ? అని అనుకునే వాళ్లూ ఎక్కువగా ఉన్నారు.


విపరీతమైన వాడకం వల్ల  పెట్రోల్, సహజవాయువు వంటి ఇంధన వనరులు  మరి కొద్ది కాలంలోనే అయిపోయే పరిస్థితి వచ్చిందని శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు కదా !


ఇప్పటికే కాపర్..వంటివి తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఖనిజాలనూ విపరీతంగా వాడేస్తే అవీ అయిపోయే రోజూ వస్తుంది. అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

Saturday, April 11, 2015

ఎన్నికల వాగ్ధానాలు ...

  
 పార్టీలు ఎన్నికల ముందు  ఎన్నో హామీలను ఇస్తాయి . 

 ఉదా..కేంద్రంలో గెలిచిన  వాళ్ళు.. నల్లడబ్బును తిరిగి తెస్తామని, అవినీతిని అరికడతామని, నదులను మురుగు నుండి ప్రక్షాళన చేస్తామని, ధరలను తగ్గిస్తామని ....ఎన్నో వాగ్ధానాలతో ఎన్నికలలో గెలుపొందారు. 


అయితే, ఇచ్చిన  హామీలు  నత్తనడక  నడుస్తున్నాయి.

.................................. 

గంగానది నుండి మురుగును తొలగించాలంటే , ఎన్నో పరిశ్రమల నుండి గంగలోకి వదులుతున్న వ్యర్ధాలను కట్టడి చేసే చర్యలను వేగవంతం చేయాలి.
.....................

ఇక, బుల్లెట్ ట్రైన్లు.. .అంటూ చెబుతున్నారు. బుల్లెట్ ట్రైన్ల సంగతి అలా ఉంచితే,  దేశంలోని రైళ్ల పరిస్థితి అందరికీ తెలిసిందే.

 చాలా  లెవెల్ క్రాసింగుల వద్ద గేట్లు  లేక యాక్సిడెంట్స్  జరిగాయి . అలా జరగకుండా చూడాలి . 


ఇక రైల్వేస్టేషన్ల వద్ద  ట్రాక్ ల వద్ద చూస్తే మలమూత్రాలతో అసహ్యంగా ఉంటాయి. మలమూత్రాలు   ట్రాక్స్ పైన పడకుండా  రైళ్ళలో  సరికొత్త   టాయ్ లెట్స్ ఏర్పాటు చేస్తామని ఎప్పటినుంచో చెబుతున్నారు. 



అవన్నీ ఆచరణలోకి వచ్చేటప్పటికి  ఎంతకాలం పడుతుందో  ?  సాధారణ  రైళ్ళ విషయంలో  పరిస్థితి  బాగుపడితే,  అప్పుడు  బుల్లెట్ ట్రైన్లు   వచ్చినా   బాగుంటుంది . 

..................

ఇక స్వచ్చభారత్ అంటూన్నారు  కానీ,  స్వచ్చభారత్ కు అవసరమైన ఏర్పాట్లేవీ ? 

ప్రతివీధికి రెండు, మూడురకాల చెత్తడబ్బాలను ఏర్పాటు చేయాలి. వంటింటి చెత్త,  ప్లాస్టిక్ వేస్ట్, ఎలెక్ట్రానిక్ వేస్ట్..ఇలా దేనికది విడిగా పారవేయటానికి చెత్తబుట్టలను ఏర్పాటుచేయాలి. 

 తగినంతమంది  పారిశుధ్య కార్మికులను  నియమించి  వారికి జబ్బులు రాకుండా  మాస్కులను,  గ్లవుసులను  ఇచ్చి  నియమించాలి. ఇవేమీ ఏర్పాటు చేయకుండా  స్వచ్చభారత్ ఎలా సాధ్యం ?


స్వచ్చభారత్ అనే పిలుపు వల్ల మాత్రం ప్రజలలో ఎంతోకొంత మార్పు వచ్చింది. అయితే, ప్రభుత్వాలు ప్రకటించే చక్కటి పధకాలు ఆచరణలో సరిగ్గా అమలుజరిగేలా అధికారులూ,  ప్రజలూ కూడా సహకరిస్తేనే    చక్కటి ఫలితాలు వస్తాయి.
....................

ఇక,   భారీ పరిశ్రమల వల్ల ఎక్కువమందికి ఉపాధి లభించదని... చిన్నతరహా పరిశ్రమల వల్లే ఎక్కువమందికి ఉపాధి లభిస్తుందనీ  లెక్కలతో సహా  సాక్షాత్తూ ప్రధానమంత్రి గారే తెలియజేసారు.  


మరి, భారీ పెట్టుబడులు కావాలి, భారీ పరిశ్రమలు రావాలి .. .అంటూ  ఇతర దేశాలను అంతగా అడగటం ఏమిటో  అర్ధం కాదు. 


అయితే ప్రధానమంత్రి గారికి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలనే బలమైన పట్టుదల ఉందన్నది  కాదనలేని విషయం. 


 ముద్రా బ్యాంక్ అనేదాన్ని ప్రారంభించి చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిస్తామనీ చెప్పారు. ఇది చాలా ఆశాజనకంగా ఉంది.


 అయితే ఆచరణలో వేగం ఉంటుందా ? లేక ఇది కూడా నత్తనడక నడుస్తుందా ? అనేది ఇప్పుడే తెలియదు. 

............................ 

ఈ దేశంలో ఎంతో ప్రతిభ కల యువత ఉన్నారు. మనదేశంలోనూ చక్కటి వ్యాపారం తెలిసిన వాళ్ళున్నారు. అద్భుతమైన తెలివితేటలున్నవాళ్ళున్నారు.


 ఇక్కడ వారికి సరైన ఆదరణ లభించక విదేశాలకు  తరలిపోతున్నారు.  సరైన ఆదరణ లభిస్తే  టెక్నాలజీతో  సహా  అన్ని రంగాల లోను   ఎన్నో అద్భుతాలను సాధిస్తారు. 


మనవాళ్ళను  సరిగ్గా  పట్టించుకోకుండా ,  అన్ని విషయాల లోనూ   విదేశాల  సాయం  కోసం  తిరగటం వల్ల  దేశానికి  కలిగే  గొప్పలాభమేమీ ఉండదు.

.........................

ఇక ,రైతులకు భరోసాను కల్పిస్తామని  అంటూనే  భూసేకరణ చట్టాన్ని తెచ్చింది కేంద్రప్రభుత్వం. ఇది మాత్రం  దేశంపై చాలా ప్రభావాన్ని చూపే అంశం. 


 ప్రభుత్వభూములను  సెజ్ ల కోసం కేటాయిస్తారు. ఇంకా  భూములు కావాలంటూ రైతులను బలవంతం చేస్తారు. 


అసలే రైతులు గిట్టుబాటుధరలు లేక బాధపడుతుంటే  దెబ్బమీద దెబ్బ అన్నట్లు దిగజారింది దేశంలోని రైతుల  పరిస్థితి.


 ప్రభుత్వాలు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రజలు  అన్నీ గమనిస్తూనే ఉంటారు. అన్నీ గుర్తుపెట్టుకుని సమయం వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారు. 

.......................

ధనవంతులు పల్లెలను దత్తత తీసుకోవటం బాగుంది . అయితే, ఆచరణలో చక్కటి ఫలితాలు వచ్చి పల్లెలు అభివద్ధి చెందుతాయని ఆశిద్దాము . 


స్కాములతో కూడిన  గత ప్రభుత్వాలపై విసుగుచెంది ప్రజలు కొత్తప్రభుత్వాన్ని అత్యధికమెజార్టీతో గెలిపించారు. కొత్త ప్రభుత్వాలు  ప్రజల ఆశలను వమ్ముచేయవని ఆశిద్దాము. 

......................... 

దేశంలోని చాలా మంది  ప్రజలు  ఎక్కువ డబ్బున్నవారు కాదు.  ధరల తగ్గుదల, సరైన వైద్య సౌకర్యాలు, నీటికొరత లేకుండా ఉండటం... వంటి నిత్యావసరాలకు సంబంధించిన కోరికలు ముందు తీరటం వారికి ముఖ్యం.


ఎన్నికల తరువాత  కేంద్రంలోని సర్కారు తీరు  కొంచెం  నిరాశను కలిగించగా, 


సామాన్య ప్రజల కనీసావసరాలను తీరుస్తామని వాగ్ధానం చేసి డిల్లీ ఎన్నికలలో నిలబడ్ద  ఆప్ పార్టీని గెలిపించారు ఢిల్లీ  ప్రజలు. అయితే, ఎంతో నమ్మి రెండోసారి గెలిపించినా అంతర్గత కుమ్ములాటలో కూరుకుని ఉంది ఆప్ పార్టీ. 

.... 
అయితే మనుషులకు  ఆశావాదం అవసరం కాబట్టి, పార్టీలు  ప్రజలకు చేసిన వాగ్ధానాలను  నెరవేర్చటానికి ప్రయత్నిస్తాయని  ఆశిద్దాము.


Wednesday, April 8, 2015

డబ్బు ఉంటే ఉద్యోగాలను కల్పించటం పెద్ద పనేమీ కాదు.....

 
ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే.. నిరుద్యోగ సమస్య లేకుండా చేయవచ్చు. డబ్బు ఉంటే ఉద్యోగాలను కల్పించటం పెద్ద పనేమీ కాదు.

ఉదా.. రహదారుల   ప్రక్కన  మొక్కలు నాటి,  వాటిని  పెంచి పోషించే పని కోసం అనేక ఉద్యోగాలను కల్పించవచ్చు. 


స్వచ్చభారత్ కోసం వీధికి పదిమంది ఉద్యోగస్తులను నియమించవచ్చు.


ప్రభుత్వ ఆసుపత్రులలో మరింత మంది వైద్యులను, సిబ్బందిని నియమించవచ్చు. 


ఎన్నో ప్రభుత్వకార్యాలయాలలో సిబ్బంది కొరత ఉంది. ఆ విధంగా ఎందరికో ఉపాధిని కల్పించవచ్చు. 


ఏతావాతా తేలేదేమిటంటే , ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటే  యువతకు ఉపాధిని కల్పించటం పెద్ద సమస్య కాదు.

....................

అయితే సమస్య ఏమిటంటే.. ప్రభుత్వాల వద్ద  డబ్బు ఉండాలి. 


 ప్రజలందరి  సొత్తు  అయిన  సహజవనరులను  ప్రైవేటీకరణ  పేరుతో  కొందరికి  అప్పగిస్తే  ప్రజా సంక్షేమ కార్యక్రమాలు  చేయటానికి  ప్రభుత్వం  వద్ద  డబ్బు  ఎక్కడినుంచి  వస్తుంది?


ప్రైవేటీకరణ  తగు మాత్రమే  ఉండాలి. ఎక్కువ సహజవనరులు  ప్రభుత్వం  యొక్క  ఆధీనంలోనే  ఉండాలి. 

...............

ప్రభుత్వానికి  ప్రజలు చెల్లించే  పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఒక మార్గం. 


అయితే, ఆదాయం కోసం  ప్రజల మీద  మరీ
 అధిక  పన్నులు  వేయటం,  మద్యం  మీద  వచ్చే ఆదాయంపై  ఆధారపడటం  సరైనది  కాదు. 
..................

ప్రభుత్వానికి  అనేక ఖర్చులుంటాయి.


 ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు,  ప్రజల సంక్షేమ పధకాలకు, దేశరక్షణ  కార్యక్రమాలకు..... ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. 


మరి వీటన్నింటికి  అవసరమైనంత డబ్బు ఉండాలంటే ప్రభుత్వానికి ఆదాయం బాగుండాలి. అనవసరపు ఖర్చు తగ్గించుకోవాలి. 


అయితే, రక్షణ రంగం వంటి  విషయాలలో ఖర్చు తగ్గించటం అంటే కుదరదు. 

......................

దేశంలో ప్రభుత్వం వద్ద  ఎక్కువ డబ్బు లేకపోయినా, కొందరు  ప్రజల వద్ద  డబ్బు  ఎక్కువగానే ఉంది. 

.......................

 నల్లడబ్బు కట్టడి చేస్తే  దేశంలో పేదరికం తగ్గుతుంది. అవినీతి వల్ల దేశానికి ఎంతో నష్టం జరుగుతోంది. 


ప్రభుత్వం ప్రజల  సంక్షేమపధకాలకు విడుదల చేసే డబ్బులో కూడా అవినీతి జరిగి,  పేదలకు చెందవలసిన డబ్బును..  మధ్యలో వాళ్ళు మింగేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.


కొందరు వ్యాపారస్తులు  ధరలు బాగా పెంచి  వినియోగదారులను  మోసగిస్తారు .  పన్నులు సరిగ్గా కట్టకుండా ప్రభుత్వాన్ని మోసగిస్తారు . ఇలాంటివాటికి అడ్డుకట్ట  వేయాలి . 

 .........................

వేల రూపాయల జీతం తీసుకునే  ఉద్యోగస్తులు కూడా  తమకు జీతాలు మరింతగా పెంచాలని సమ్మెల ద్వారా వత్తిడి చేస్తుంటారు. 


ఇలాంటి ఎన్నో సమస్యలతో  వేగలేక , కొన్ని  ప్రభుత్వరంగసంస్థలు తమ సంస్థలను  ప్రైవేట్ పరం చేయటానికి పూనుకుంటున్నాయి.


అయితే,  కొన్ని  ప్రైవేట్ సంస్థల వాళ్లు  ఎక్కువ జీతాలు ఉన్న కొందరు ఉద్యోగస్తులను  ఇళ్లకు పంపేసి,    తక్కువ జీతం ఇచ్చి కొత్తవాళ్లను నియమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

................
 నల్లడబ్బును, అవినీతిని  నిర్మూలించటం ,  దేశంలోని  సహజవనరులను ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకొనటం... ..వంటి చర్యల ద్వారా ప్రభుత్వానికి ఎంతో  ఆదాయం సమకూడుతుంది. 

తద్వారా దేశంలోని నిరుద్యోగ సమస్యను , పేదరికాన్ని  పారద్రోలవచ్చు. ఇందుకు  
ప్రజల తోడ్పాటు ఎంతో అవసరం.


Monday, April 6, 2015

ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తే...

 
కొన్ని నెలల క్రిందట, దేవాలయ దర్శనం కొరకు (అమరేశ్వరాలయం)  మేము అమరావతి వెళ్లి వచ్చాము.  

అమరేశ్వర లింగం చాలా ఎత్తుగా ఉంటుంది.  అమరారామము  పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది.
.......................

రాజధానికి అమరావతి పేరు బాగుంది.

.....................

దేవతల నగరం అమరావతి అంటే .. చక్కటి ప్రకృతి శోభతో కూడిన ఉద్యాన వనాలు, ఆహ్లాదకరమైన పరిసరాలతో కూడిన ప్రాంతంగా .. కవులు వర్ణించిన వర్ణనలు గుర్తుకొస్తాయి.


 అయితే ఇది భూలోకంలోని అమరావతి కాబట్టి, స్వర్గలోకపు అమరావతి అంత కాకపోయినా,  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  రాజధాని అమరావతి కూడా చక్కటి ఉద్యానవనాలతో ప్రకృతి శోభతో పచ్చగా ఉండాలని ఆశ పడటంలో తప్పులేదు మరి .

..................
ఇక్కడ మరికొన్ని విషయాలను గమనిస్తే...

దేశంలో చాలా రాష్ట్రాల రాజధానులను గమనిస్తే..  ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరే వారితో  కిటకిటలాడుతూ  రద్దీగా  ఉంటున్నాయి. 


విపరీతమైన జనాభా వల్ల  ట్రాఫిక్ జాంలు, చెత్తతో గబ్బు కొట్టే వీధులు, నేరాలు-ఘోరాలు ..అన్నట్లుగా ఉంటున్నాయి. 

................................... 

 ఉపాధి కోసం అందరూ రాజధానిపై  మాత్రమే  ఆధారపడవలసిన  పరిస్థితి కాకుండా, రాష్ట్రం లో ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు ఉండేలా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి  చేయటం  ఎంతో అవసరం .  


రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం వారు హామీ ఇచ్చారు  కాబట్టి, అలా జరుగుతుందని ఆశిద్దాము.

.................

దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. దగ్గరకు వెళ్తేనే  కొండల  గరుకుదనం , ఎత్తుపల్లాలు  తెలుస్తాయి. 


దూరంగా ఉన్న విదేశాలు ఎంతో బాగున్నట్లుగా అనిపిస్తాయి. అక్కడ  ఎంతో ఎత్తైన ఆకాశహర్మ్యాలు, నీటైన  రహదారులూ  ఉంటాయి.  అయితే, అక్కడ ఎన్నో నేరాలు కూడా జరుగుతున్నాయి. 


అందుకే, ప్రజలు తమ రక్షణార్ధం తుపాకులను దగ్గరుంచుకోవటం అనేది చాలా విదేశాల్లో సాధారణమైన  విషయం. ఇంకా మన దేశంలో పరిస్థితి అంత  తీవ్రస్థాయిలో లేదు.


అయితే , ఇప్పుడిప్పుడే అలాంటి నేరపరిస్థితి  మన దేశంలో కూడా పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఇది  అత్యంత  బాధాకరం.

.................................. 

నగరాలలో పెరుగుతున్న నేరసంస్కృతి,  డ్రగ్స్ వినియోగం..వంటి ఆందోళనకరమైన విషయాలను  గమనిస్తే , విస్తృతమైన రాజధాని కట్టుకుంటే   సమస్యలు కొని తెచ్చుకోవటం అవుతుందేమో ? అని సందేహం అనిపిస్తోంది . ( సమస్యలు  రాకపోతే మంచిదే .)


ఇలాంటి పరిస్థితులలో, మనకు  తగ్గట్లుగా రాజధానిని ఏర్పాటు చేసుకుని , మొత్తం రాష్ట్రం  అభివృద్ధి అయ్యేటట్లు చర్యలు తీసుకుంటే ఎక్కడికక్కడ అభివృద్ధి జరిగి అందరూ సంతృప్తి చెందుతారు .  

 ..............

 సామాన్య ప్రజానీకానికి తమ కనీస అవసరాలు తీరి కష్టాలు తొలగటం ఎంతో ముఖ్యం. 


 ఉదా..హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  తనకు సాధ్యమైనంతలో ప్రజలకు చక్కటి సహకారాన్ని అందించింది. 


కొన్ని లోటుపాట్లున్నా, ప్రభుత్వం అందించిన తక్షణ సహకారం పట్ల ప్రజలు ఎంతో సంతోషించారు. ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు.


 తమ కష్టాలు తీర్చేవిధంగా  ప్రభుత్వాలు  ఉండాలని ప్రజలు ఆశిస్తారు. 


ప్రజల కష్టాలు తీరటం ముఖ్యం .  ఇప్పటికిప్పుడు  పెద్ద స్థాయిలో రాజధాని  నిర్మించుకోకున్నా  ఫరవాలేదు . 

.........................

 ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది అందరూ గుర్తుంచుకోవలసిన విషయం. 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  మరియు  రాష్ట్ర  రాజధాని అమరావతి  అభివృద్ధి  పధంలో  పయనించాలని  ఆకాంక్షిస్తూ  ఆచరణలో అమలుచేయటానికి   అందరమూ ప్రయత్నిద్దాము.