ఓం.
లోకహితం కోరి దైవం
జ్యోతిషశాస్త్రాన్ని లోకానికి అందించారు. అయితే, చక్కటి
ముహూర్తాలలో పనులు ప్రారంభించాలన్నా దానికి ఎంతో అదృష్టం,
పూర్వపుణ్యం ఉండాలని, సత్ ప్రవర్తన అర్హతగా ఉన్నవారికే అన్నీ
కలిసివస్తాయి అని అనిపిస్తుంది.
ఈ రోజుల్లో కొందరు
అదేపనిగా పాపాలు చేస్తూ కూడా , తమ జీవితాలు బాగుండాలనీ, ఏదైనా
పని ప్రారంభించే ముందు గొప్ప ముహూర్తాల కోసం తాపత్రయపడటం
జరుగుతోంది.
కానీ, పాపాలను చేసే వ్యక్తులు
మంచి ముహూర్తం కోసం ఎంత తాపత్రయపడినా ఆశించిన ఫలితం దక్కదు.
చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా అన్నట్లు , ఎవరికెంత ప్రాప్తమో
అంతే దక్కుతుందట.
పాపాలు చేసేవారు
గొప్ప పండితుల వద్ద ముహూర్తం పెట్టించుకున్నా కూడా , దైవవశాన , ఆ
పండితుల నోట కూడా ( వారికి తెలియకుండానే) ఏదో ఒక దోషం ఉన్న
ముహూర్తమే వస్తుంది. ఒకవేళ మంచిముహూర్తమే పండితులు వ్రాసినా
కూడా, ఏదో విధంగా ఆ శుభముహూర్తం తప్పిపోయే అవకాశం ఉంది.
(ఉదా ... గడియారం తప్పు సమయాన్ని చూపించటం..... .వంటివి )
మంచివ్యక్తులకు
ముహూర్తం చూడటానికి కుదరకపోయినా కూడా , వారికి తెలియకుండానే
చక్కటి ముహూర్తం ఉన్న సమయంలోనే వారు పనులు ప్రారంభించే విధంగా
దైవం అవకాశాన్ని కలిగిస్తారు.
ఏ జాతకాలూ
తెలుసుకోకపోయినా చెడుపనులకు దూరంగా ఉంటూ, సత్ప్రవర్తనను
కలిగిఉండి దైవంపైన భారం వేసి జీవించే వ్యక్తికి దైవమే
సరియైన దారిని చూపిస్తారు.
....................
ముహూర్తాల గురించి పురాణేతిహాసాల్లో చక్కటి ఉదాహరణ ఉంది. అది ఏమిటంటే.....
రావణాసురుడు ఎంతో పాండిత్యం తెలిసిన వ్యక్తి అంటారు. అతనికి
జ్యోతిషం గురించి కూడా బాగా తెలుసట. తన సంతానం బాగుండాలని
భావించి, వారిపట్ల నవగ్రహాలు శుభంగా మాత్రమే ఉండాలని అనుకోగా....
సూర్యదేవుని పుత్రుడైన శనిదేవుని కోపం వల్ల , ఇంద్రజిత్తు జాతకం చెడ్డగా మారిపోయిందని అంటారు.
రావణుడు దేవతలను, మునులను , మంచి
వారిని .... బాధించటం చేస్తుండేవాడు. ఒకసారి దేవతలతో జరిగిన
యుద్దంలో గ్రహాలను కూడా బంధించి తెచ్చి తన రాజ్యంలో ఉంచాడట.
( భగవాన్ శ్రీరామ భక్తుడైన
భగవాన్ హనుమంతులవారు గ్రహాలను విడిపించగా, వారు ఎంతో
సంతోషించారట. అందువల్ల శనివారం నాడు హనుమంతుని పూజించిన వారిని
శని బాధించరని అంటారు. సూర్యుడు హనుమంతునికి గురువు. )
రావణాసురుని కధ ద్వారా
ఏమి తెలుస్తుందంటే, ఎన్ని పూజలు చేసినా పాపాలు చేసేవాళ్ళకు
దైవం సహకరించరు అని, అలాంటి వారికి మంచి ముహూర్తాలు కూడా
దొరకవు ..... అని తెలుస్తుంది.
ఇవన్నీ గమనించితే..... దైవకృపను పొందాలంటే , పూజలు చేయటంతోపాటూ సత్ప్రవర్తన కూడా ఎంతో ముఖ్యమని తెలుస్తోంది.
........
ఈ రోజుల్లో కూడా కొందరు .
ఒక చేత్తో పాపాలూ ....... ఒక చేత్తో పూజలు చేస్తూ దైవాన్నే
మోసం చేయాలని చూస్తున్నారు . రావణాసురుడంతటి వాని ఆటలే సాగలేదు.
ఇక ఈ నాటి పాపాత్ముల అతితెలివి ఎందుకూ పనికిరాదు.
తల్లితండ్రులు తమకు
పుట్టబోయే సంతానం మంచి ముహూర్తంలో జన్మించాలని, వారి భవిష్యత్తు
బాగుండాలని ఎంతో తాపత్రయపడతారు. తమ సంతానం యొక్క భవిష్యత్తు
బాగుండాలని తల్లితండ్రులు ఆశపడటం సహజమే.
అయితే, చక్కటి భవిష్యత్తు
కలిగిన సంతానం కలగాలన్నా, చక్కటి ముహూర్తాలు కలిసి రావాలన్నా .....
పెద్దవాళ్ళు చక్కటి నైతికవిలువలతో కూడిన జీవితాన్ని
కలిగిఉండాలి. కనీసం సత్ప్రవర్తన కొరకు సాధ్యమయినంత వరకు
ప్రయత్నించాలి.
..............................
కొంతకాలం క్రిందట మేము ఒక
ఉరిలో ఉన్నప్పుడు మాకు తెలిసిన ఒకరికి సంతానం లేరు. కొంతకాలానికి
ఆమె గర్భం ధరించింది. వారు ముందే డెలివరీ కోసం మంచి
ముహూర్తాన్ని కూడా చూసి పెట్టుకున్నారు.
ఇక వారం రోజుల్లో డెలివరీ ఉందనగా
దురదృష్టవశాత్తూ తల్లి మృతశిశువును ప్రసవించింది. పెద్ద
పేరున్న డాక్టర్లు ఎంత ప్రయత్నించినా బిడ్డను రక్షించలేకపోయారు.
పాపం ఆ తల్లిదండ్రులు ఏ జన్మలో చేసుకున్న పాపఫలితం వల్లో అలా
జరిగి ఉంటుంది.
ఇలాంటివి గమనిస్తే ముందే
అనుకున్న ముహూర్తంలో చక్కగా పని జరగాలన్నా దైవానుగ్రహం ఉండాలని
తెలుస్తుంది. దైవానుగ్రహం ఉండాలంటే వ్యక్తులకు పూర్వపుణ్యం ఉండాలి.
పూర్వపుణ్యం ఉండాలంటే సత్కర్మలు చేసి ఉండాలి.
ఎట్లా చూసినా , దైవకృపను పొందాలంటే సత్కర్మాచరణే మానవుల కర్తవ్యమని స్పష్టమవుతుంది.
మాకు తెలిసిన ఇంకొక
ఆమెకు ఒక గర్భాన్ని కోల్పోవటం జరిగితే , తరువాత
నాగేంద్రస్వామిని ఆరాధించటం, దైవానికి పుట్టలో పాలు పోయటం
చేసారు. కొద్దికాలంలోనే వారికి చక్కటి అబ్బాయి పుట్టటం
జరిగింది. నాగులచవితికి భక్తిగా పుట్టలో పాలు పోసిన ఆమె ఒక
లేడిడాక్టర్.
అంతా దైవం దయ. వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.
ఈ బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి అనేక కృతజ్నతలండి .