ఏ మతమూ చెడ్డ విషయాలను బోధించదు. గ్రంధాలలోని విషయాలను సరిగ్గా అర్ధం చేసుకోని వారి వల్ల మరియు కొందరు స్వార్ధపరుల వల్ల తరతరాలుగా సమాజంలో అపార్ధాలు ఏర్పడ్దాయి.
ఆధునిక విజ్ఞానాన్ని కొందరు తమ స్వార్ధానికి వాడుకుంటున్నట్లే , ఆధ్యాత్మికతను కూడా కొందరు తమ స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు.
కొందరు స్వార్ధం వల్ల , మరి కొందరు తెలిసీతెలియనితనం వల్ల సమాజంలో కొన్ని మూఢాచారాలను వ్యాపింపచేశారు.
ప్రాచీన గ్రంధాలను సరైన తీరులో అర్ధం చేసుకుంటే సమాజం ఎంతో బాగుంటుంది.
.......................
ఓం.
శ్రీ కృష్ణ పరమాత్మ బోధించిన భక్తి యోగములో కొంత భాగము.....
వివేకముతో గూడని అభ్యాసము కంటె , ( శాస్త్రజన్య ) జ్ఞానము శ్రేష్ఠమైనదై కదా !( శాస్త్రజన్య ) జ్ఞానము కంటె , ధ్యానము శ్రేష్ఠమగుచున్నది.ధ్యానము ( ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగ నుండు మనఃస్థితి ) కంటె కర్మఫలమును విడుచుట ( ప్రవృతి యందును విషయదోషము లేకుండుట ) శ్రేష్ఠమై యున్నది. అట్టికర్మఫలత్యాగముచే శీఘ్రముగ
( చిత్త ) శాంతి లభించుచున్నది.
సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి, కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖ దుఃఖములందు సమభావము గలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపఱచు కొనినవాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడును, నాయందు భక్తిగలవాడును ఎవడు కలడో, అతడు నాకు ఇష్టుడు.
ఎవని వలన ప్రపంచము ( జనులు ) భయమును బొందదో, లోకము వలన ఎవడు భయమును బొందడో
ఎవడు సంతోషము , క్రోధము, భయము, మనోవ్యాకులత - మున్నగునవి లేకుండునో అట్టివాడు నాకు ఇష్టుడు.
.....................................................
గీత మరియు ప్రాచీన గ్రంధాల ద్వారా మనము ఎన్నో చక్కటి విషయాలను తెలుసుకోగలము. తెలుసుకున్న విషయాలను ఆచరణకు ప్రయత్నించాలి.
అప్పుడు, అత్యాశ, అవినీతి, ఇతరులతో అనవసరంగా పోటీపడటం, ఇతరుల సొమ్మును అపహరించటం, వంటి దుర్లక్షణాలు తగ్గిపోతాయి. నైతికవిలువలతో జీవించటం అలవాటవుతుంది. లోకం ప్రశాంతంగా ఉంటుంది.
ఈ రోజుల్లో నైతికవిలువలకు ప్రాధాన్యత తగ్గి, ఎలాగైనా సరే డబ్బును సంపాదించి విలాసంగా జీవించాలి . అనుకునే వారి సంఖ్య పెరిగింది.
అత్యాశ, అనవసరపు పోటీ , అధికారదాహం వల్ల అణ్వాయుధాల పోటీ పెరుగుతుంది.
అందువల్ల , సమాజంలోని ఎంతో సొమ్మును ఆయుధ పోటీకే ఖర్చు చేయవలసి వస్తోంది.
అందువల్ల , పేదరిక నిర్మూలన కార్యక్రమాల కోసం డబ్బు సరిపోవటం లేదు.
పరస్పర అపనమ్మకాల వల్ల ఇప్పుడు ప్రపంచదేశాల వద్ద అణ్వాస్త్రాలు గుట్టలుగా పడి ఉన్నాయి.
ఆయుధాల గుట్టల మధ్య ప్రపంచం ఇంకా క్షేమంగా ఉందంటే దైవం దయ వల్లనే.
ఈ ఆయుధాలు చెడ్డవారి చేతిలో పడకూడదని దైవాన్ని ప్రార్ధించటం మినహా సామాన్య ప్రజలు ఏం చేయగలరు ?
ఆధునిక విజ్ఞానాన్ని కూడా కొందరు వ్యక్తులు మితిమీరి ఉపయోగిస్తున్నారు.
ఈ ప్రపంచంలో మనుషులే మాత్రమే కాదు. ఇతర జీవులు ఎన్నో ఉన్నాయి.
కొందరు తమ అత్యాశ ,అంతులేని కోరికల కోసం పర్యావరణాన్ని పాడుచేస్తూ , ఇతరజీవులకు ముప్పును కలిగిస్తున్నారు.
మితిమీరిన పారిశ్రామీకరణ వల్లే ఆమ్ల వర్షాలు పడుతున్నాయట.
ఇలాంటి ఎన్నో పెను ప్రమాదసూచికలు కనిపిస్తున్నా కూడా ప్రజలు సరిగ్గా పట్టించుకోవటంలేదు. నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు.
ఇక ప్రపంచాన్ని దైవమే రక్షించాలి.
మీరు చెప్పినట్లు:
అయితే ఇందులో మనకు ఏది ఎంతవరకు మంచిదో, అవసరమో అంతవరకూ మాత్రమే ఉపయోగించుకుంటే ఈ టెక్నాలజీ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి.
మీరు చెప్పినట్లు సైనైడ్, వైరస్ లు ఎంతోమందిని నాశనం చెయ్యగల శక్తి కలవే కావచ్చు. అంటే వాటిని చిన్నపాటి భూతాలుగా చెప్పుకోవచ్చు.
అణుశక్తిని పెద్దభూతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సైనైడ్, వైరస్ ల దుష్ప్రభావాలతో పోల్చితే ............... అణుశక్తి విషయంలో జరిగే పొరపాట్ల వల్ల ................. కలిగే దుష్ప్రభావాలు, వినాశనం ........................ ఊహకందనంత ఉంటాయట.
వాటి ప్రభావం .........వేల సంవత్సరాలు భూమిపై ఉంటుందని చెబుతున్నారు కదండి. దానివల్ల ఎన్నో తరాల వరకు రకరకాల జబ్బులతో బాధపడే అవకాశం ఉందట.
అలాంటి ప్రమాదాలు జరిగిన చోట్ల ఇప్పటికీ చిన్నమొక్కలు కూడా మొలవలేదట. మొలిచినా ఆ మొక్కలలో, అక్కడి నీటిలో, గాలిలో కొన్ని వందల సంవత్సరాలు అణుధార్మికత నిండి ఉంటుందట.
ఇలాంటి అణుశక్తిని వైద్యంకొరకు ఉపయోగించటం కూడా కొరివితో తల గోక్కోటంలా వుతుందేమో అనిపిస్తోంది. అందుకని దాన్ని ఏ విధంగానూ ఉపయోగించకుండా ఉండటమే శ్రేయస్కరమేమోనని ఒకోసారి అనిపిస్తుంది.
నిజమే అణుశక్తిని వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. దానివల్ల జబ్బు ఉన్న సెల్స్ నాశనం అవుతాయి గానీ, ప్రక్కనున్న మంచి సెల్స్ రేడియేషన్ కు గురయ్యి దెబ్బతిని ............... మళ్ళీ వాటికి ట్రీట్మెంట్ ............. ఇలా అంతులేని కధలా సాగే అవకాశం కూడా ఒకోసారి ఉందట.
అసలు ఈ మధ్య కాలంలో మనం వాడుతున్న వస్తువుల ద్వారా వెలువడుతున్న రేడియేషన్ వల్లనే జనానికి మొండి జబ్బులు రావటం ఎక్కువయ్యిందని అంటున్నారు .
కొన్ని మొండి జబ్బులు ఆయుర్వేదం , హోమియో లాంటి వాటికి తగ్గటం జరుగుతోంది. ఈ రకమైన మొండిజబ్బులను తగ్గించటానికి ప్రాచీన వైద్యగ్రంధాలను శోధించితే తప్పక మంచి పరిష్కారం దొరుకుతుందని నా అభిప్రాయమండి.
అప్పటివరకూ,వేరేదారిలేక ఇప్పుడున్న విధానాలను వాడుతూనే ఉంటారేమో ప్రజలు ?
ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారముంటుందట......... శోధించగలిగితే..............( దైవానుగ్రహం తోడయితే.).